నవతెలంగాణ-హైదరాబాద్: 70కి పైగా స్థానాల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొడతామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ తమకు వ్యతిరేకంగా ఉండటం ఇది తొలిసారి కాదన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2018 ఎన్నికల్లో భారాసకు 88 సీట్లు వస్తాయని ఏ సర్వే కూడా గుర్తించలేకపోయిందని.. అప్పటి ఫలితాలు ఎలా ఉన్నాయో ప్రజల చూశారని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం 88కి పైగా స్థానాలు వస్తాయని అంచనా వేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల 70కి పైగా స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందన్నారు. ఎగ్జిట్ పోల్స్కు అంత శాస్త్రీయత ఉందని తాము అనుకోవట్లేదన్నారు. పోలింగ్ జరుగుతుండగానే ఎగ్జిట్ పోల్స్ సర్వే జరుగుతుందని, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూసి కార్యకర్తలు ఆందోళన చెందవద్దని సూచించారు.