– గుర్తించిన రాష్ట్ర సర్కార్
– రూ.200 కోట్లు గోల్ మాల్ అయినట్టు అంచనా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీఎంఆర్ఎఫ్ నిధులు దుర్వినియోగమయి నట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో భారీ గోల్మాల్ జరిగింది. 2018లోనే రాష్ట్ర అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు ముందు అప్పటి ఎమ్మెల్యేల సన్నిహిత అనుచరులకు నియోజకవర్గానికి 20 మంది చొప్పున ఎలాంటి మెడికల్ బిల్లులు లేకుండా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు చెక్కులను అందించారు. దీంతో ఈ వ్యవహారంలో రూ.200 కోట్లు దుర్వినియోగం అయినట్టు అంచనా వేస్తున్నారు. 2014లో మొదటిసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఐదేండ్లు పూర్తి కాకుండా ఏడాది ముందే ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికల సమయంలో అనుచరుల నుంచి లబ్ధి పొందేందుకే ఈ రకంగా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు దీని వెనక ఎవరు ఉన్నారు? ఏ విధంగా ముఖ్యమంత్రి సహాయనిధిని దుర్విని యోగం చేశారు? ఎవరి ఆదేశాలతో ఈ తతంగం నడిపించారనే దానిపై ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అంతర్గతంగా విచారిస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పెద్ద సంఖ్యలోనే ఉన్నది. అయితే అర్హులైన పేదలు రూ.లక్షల్లో పెట్టుకున్న బిల్లులకు రూ.50 వేల లోపే చెక్కుల రూపంలో అందగా.. ఎలాంటి బిల్లులు లేకుండా రూ.లక్షల్లో ఎమ్మెల్యేలకు దగ్గరగా ఉన్నోళ్లకు అందజేయడం గమనార్హం.
సాధారణంగా ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ఇందుకోసం తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదలు స్తోమతకు మించి ప్రయివేటు హాస్పిటళ్లలో ఖర్చు పెట్టి చికిత్స చేయించుకుంటే.. అందుకు సంబంధించిన పూర్తి బిల్లులను ప్రభుత్వా నికి సమర్పించాల్సి ఉంటుంది. ముందుగా బాధితులు ఎమ్మెల్యేకు దరఖాస్తు చేసుకుంటే వారు సీఎంవోకు పంపుతారు. అక్కడ సీఎంఆర్ఎఫ్ సెక్షన్లో కమిటీ పరిశీలించి ఆర్థిక సాయం మంజూరు చేస్తుంది. ఆ తరువాత మూడు లేదా నాలుగు నెలలకు చెక్కులను ఎమ్మెల్యేల చేతుల మీదుగా బాధితులకు అందజేస్తారు. అయితే 2018లో మూడు వేలకు పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల్లో లక్షలాది రూపాయలు అధికార పార్టీ ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లాయి. వారు ప్రత్యేకంగా సూచించిన పేర్లకే రూ.10 లక్షలు రూ.15 లక్షల దాకా సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందినట్టు తెలిసింది.