మోడల్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష

ఫలితాలు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని మోడల్‌ స్కూళ్లలో ఆరో తరగతితోపాటు ఏడు నుంచి పదో తరగతి వరకు ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు మోడల్‌ స్కూళ్ల అదనపు సంచాలకులు సిహెచ్‌ రమణకుమార్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆరు నుంచి పదో తరగతిలో ప్రవేశాలకు గతనెల 16న రాతపరీక్షను నిర్వహించామని తెలిపారు. 70,041 మంది విద్యార్థులు దరఖాస్తు చేస్తే, 55,957 మంది పరీక్ష రాశారని వివరించారు. ఆరో తరగతి ప్రవేశాలతోపాటు ఏడు నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల మెరిట్‌ జాబితాను రూపొందించామని పేర్కొన్నారు. పాఠశాలల వారీగా రూపొందించి సంబంధిత మోడల్‌ స్కూళ్ల ప్రిన్సిపాళ్లకు పంపించామని వివరించారు. రాతపరీక్షకు హాజరైన అభ్యర్థులు ప్రవేశాల కోసం ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని సూచించారు. దరఖాస్తు ఫారం, హాల్‌టికెట్‌తోపాటు అవసరమైన ధ్రువపత్రాలను వెంట తీసుకెళ్లాలని కోరారు.

Spread the love