సమ్మక్క-సారక్క పేరుతో గిరిజన విశ్వవిద్యాలయాన్ని స్థాపించాం: మోడీ

నవతెలంగాణ – ఆదిలాబాద్‌: వికసిత్‌ భారత్‌ కోసం తమ పార్టీ కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆదిలాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విజయ సంకల్ప సభ’లో ఆయన మాట్లాడారు. ఇది ఎన్నికల సభ కాదని.. అభివృద్ధి ఉత్సవమని చెప్పారు. 15 రోజుల్లో 5 ఎయిమ్స్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేశామన్నారు. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలవాలన్నారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పై ఈ సందర్భంగా మోడీ పలు విమర్శలు చేశారు. ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం కుంగింది. ఈ విషయంలో ఆ పార్టీతో కాంగ్రెస్‌ కుమ్మక్కవుతోంది. గతంలో మీరు తిన్నారు.. ఇప్పుడు మేం తింటాం అన్నట్లు కాంగ్రెస్‌ పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్‌ వచ్చినా పాలనలో ఎలాంటి మార్పు లేదు. రాష్ట్రంలో సమ్మక్క-సారక్క పేరుతో గిరిజన విశ్వవిద్యాలయాన్ని స్థాపించాం. 140 కోట్ల మంది ప్రజలే నా కుటుంబం. ప్రజల కలల సాకారం కోసం నేను పనిచేస్తా. మోడీ గ్యారంటీ అంటే.. కచ్చితంగా అమలయ్యే గ్యారంటీ. దేశంలో 7 మెగా టెక్స్‌టైల్‌ పార్కులు ఏర్పాటు చేయబోతున్నాం. అందులో ఒకటి తెలంగాణలో పెడతాం’’ అని మోడీ అన్నారు.

Spread the love