– విచారణకు సుప్రీంకోర్టు అధికారులను నియమించాలి : కపిల్ సిబాల్ డిమాండ్
న్యూఢిల్లీ : నీట్ యూజీ 2024పై రేగుతున్న వివాదాలపై విచారణ చేయడానికి సుప్రీంకోర్టు అధికారులను నియమించాలని కాంగ్రెస్ నాయకులు, రాజ్యసభ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి కపిల్సిబాల్ ఆదివారం డిమాండ్ చేశారు. అలాగే, భవిష్యత్లో నీట్ను పరీక్షను ఎలా నిర్వహించాలనే విషయంపై అన్ని రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరపాలని కపిల్ సిబాల్ డిమాండ్ చేశారు. పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ సిబాల్ ఈ డిమాండ్లు చేశారు. అలాగే ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నీట్ పరీక్షా విధానం అవినీతిమయమయిందని వార్తలు వస్తున్నప్పుడు ‘ప్రధానమంత్రి మౌనంగా ఉండటం నిజంగా మంచిది కాదు’ అని అన్నారు. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని బలంగా లేవనెత్తాలని అన్ని రాజకీయ పార్టీలకు కపిల్ సిబాల్ విజ్ఞప్తి చేశారు. అయితే ఈ అంశంపై చర్చకు మోడీ ప్రభుత్వం అనుకూలంగా ఉంటుందనే నమ్మకాన్ని కపిల్ సిబాల్ వ్యక్తం చేయలేదు. ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఎ)పై ప్రస్తుతం అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎన్టిఎ అవినీతిని మీడియా ఫ్లాట్ఫామ్స్ వెలుగులోకి తెచ్చాయి’ అని అన్నారు. 2009 మే 29 నుంచి 2012 అక్టోబర్ 29 వరకూ అప్పటి మానవ వనరులు అభివృద్ధి శాఖ (హెచ్ఆర్డి) (ఇప్పుడు విద్యాశాఖ) మంత్రిగా కపిల్ సిబాల్ బాధ్యతలు నిర్వహించారు. ‘గుజరాత్లో జరిగిన కొన్ని సంఘటనలు నన్నే కాదు.. దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి తీవ్రమైన అంశాలకు ఎన్టిఎ సమాధానం ఇవ్వాలి’ అని సిబాల్ అన్నారు. ఇంకా నిరాశ, దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏమిటంటే ప్రస్తుతం ప్రభుత్వం ఆధ్వర్యంలో అవినీతి జరిగినప్పుడల్లా ‘గుడ్డి భక్తులు’ యుపిఎను నిందిస్తారని, ఇది చాలా దురదృష్టకరమని సిబాల్ వ్యాఖ్యనించారు. హెచ్ఆర్డి మంత్రిగా నీట్తో తనకు ఎటువంటి సంబంధంలేదని అన్నారు. ఎంబిబిఎస్ కోర్సులో ప్రవేశం పొందే విద్యార్థులకు జాతీయ స్థాయి అర్హత పరీక్ష ఉండాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ) బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సిఫార్సుల మేరకు నీట్ ప్రవేశపట్టారని చెప్పారు. అయితే ఎంసిఐకు ఇలాంటి సామర్థ్యం లేదని దాఖలైన కొన్ని పిటీషన్ల విచారణ తరువాత సుప్రీంకోర్టు 2016లో నీట్ను సమర్థించిందని కపిల్ సిబాల్ గుర్తు చేశారు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 1956 చట్టం స్థానంలో 2019 ఆగస్టున నేషనల్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ను ఆమోదించారని వెల్లడించారు. ఈ చట్టాన్ని బిజెపి ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని, దీనికి యుపిఎతో ఎటువంటి సంబంధం లేదని అన్నారు. నీట్ పరీక్షల్లో పేపర్ లీక్ లేదా రిగ్గింగ్ జరగలేదని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలను కపిల్ సిబాల్ తీవ్రంగా ఖండించారు. తప్పు జరిగిందని అంగీకరించే మంత్రి మోడీ మంత్రివర్గంలోనే లేడని అన్నారు. నీట్ పరీక్షల్లో ఉల్లంఘనలు, అక్రమాలపై సమగ్ర విచారణ అవసరమని కపిల్ సిబాల్ చెప్పారు. సిబిఐ విచారణ ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వాన్ని రక్షిస్తుందని, కాబట్టి స్వతంత్ర సంస్థ లేదా సుప్రీంకోర్టు నియమించిన అధికారుల ద్వారా విచారణ అవసరమని అన్నారు. మోడీ ప్రభుత్వం ప్రతీ విషయాన్ని కేంద్రీకృతం చేస్తుందని, అయితే 140 కోట్ల జనాభా, సంక్లిష్టమైన సామాజిక వ్యవస్థ ఉన్న దేశంలో మెడిసన్ ప్రవేశాలు ఎలాంటి ఉండాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం ప్రతీ రాష్ట్రాన్ని సంప్రదించి ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లాలని కపిల్ సిబాల్ కోరారు.