– ఆదివాసీ సంఘాలు, నాయకులతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
– గోండీ భాషలో బోధనపై సమగ్ర నివేదికకు ఆదేశం
– సాగుకు ఉచితంగా సోలార్ పంపు సెట్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆదివాసీ యోధుడు కొమురం భీం జయంతి, వర్ధంతిని అధికారికంగా (స్టేట్ ఫంక్షన్గా) నిర్వహిస్తామని సీఎం ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకు సంబంధించి వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆదివాసీ సంఘాలు, నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తమ ప్రాంతాల్లో రవాణా, సాగు, తాగునీటి సరఫరా, తమపై నమోదైన, నమోదవుతున్న కేసులు, విద్యా, ఉద్యోగ, ఆర్థిక సమస్యలను ఆదివాసీ నాయకులు ముఖ్యమంత్రికి సోదాహరణంగా వివరించారు. ప్రతి సమస్యను సావధానంగా విన్న సీఎం రేవంత్ రెడ్డి వారు లేవనెత్తిన పలు సమస్యలకు వెంటనే స్పందించారు. మరి కొన్నింటి పరిష్కారానికి సమగ్ర అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఇది తొలి సమావేశం మాత్రమేననీ, ప్రతి నాలుగు నెలలకు ఒకసారి సమావేశమవుదామని ఆదివాసీ నాయకులకు సీఎం తెలిపారు. ఏడాదికి మూడు సార్లు జరిగే సమావేశాల్లో గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు, రాబోయే కాలంలో పరిష్కరించుకోవాల్సిన అంశాలపై చర్చిస్తామని వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభయమిచ్చారు. సమస్యలను తన దృష్టికి తీసుకురావాలనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళనలకు దిగొద్దని సీఎం సూచించారు. ఆందోళనల ఫలితంగా యువకులపై కేసులు నమోదైతే భవిష్యత్తులో అవి వారి ఉద్యోగ అవకాశాలకు గండిపెడతాయని సీఎం తెలిపారు. ఆదివాసీలపై ఉద్యమాల సమయంలో పెట్టిన కేసులు ఎత్తివేస్తామనీ, ఈ విషయంలో అవసరమైతే శాసనసభలో చర్చపెట్టి తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. తాను పీసీసీ అధ్యక్షునిగా అయిన తర్వాత
తొలి సమావేశం ఇంద్రవెల్లిలోనే పెట్టానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాటి సమావేశంలో తన దష్టికి వచ్చిన ఇంద్రవెల్లి అమరుల స్మృతివనం ఏర్పాటు, అమరుల కుటుంబాలకు ఇండ్ల మంజూరు వంటి వాటిని అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేశామని సీఎం తెలిపారు. రాజకీయాలపరంగా ఆదివాసీలకు అన్యాయం జరగకుండా చూస్తున్నామనీ, సీతక్కను ఆదిలాబాద్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా పెట్టామని ముఖ్యమంత్రి అన్నారు.
ఆదివాసీ విద్యార్థులకు ప్రత్యేక స్టడీ సర్కిల్
ఆదివాసీ విద్యార్థుల విద్యా, ఉద్యోగ, ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా ఆదివాసీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. స్టడీ సర్కిల్కు అవసరమైన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ఆదివాసీ విద్యార్థులందరికీ ఓవర్షిప్ స్కాలర్షిప్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ దరఖాస్తుల వివరాలను వెంటనే మంత్రి సీతక్కకు అందజేయాలని సీఎం ఆదివాసీ నాయకులకు సూచించారు. విద్యార్థులకు గోండీ భాషలో ప్రాథమిక విద్యను బోధించడానికి అవసరమైన ప్రణాళికపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉట్నూరు, భద్రాచలంలోని ట్రైబల్ బీఈడీ కళాశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అవసరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలని ఆదేశించారు. ఆదివాసీ విద్యార్థులకు స్కిల్ యూనివర్సిటీలో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామనీ, వారికి వసతి కల్పిస్తామని సీఎం తెలిపారు. ఏజెన్సీలోని ఐటీఐలను ఏటీసీలుగా మార్చుతున్నామనీ, వాటిలో ఆదివాసీ విద్యార్థులు చేరేలా ఆదివాసీ పెద్దలు, విద్యావంతులు ప్రోత్సహించాలని సీఎం సూచించారు.
ఆర్థికాభివృద్ధిపై దృష్టి
ఆదివాసీల ఆర్థికాభివృద్ధికి అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేల కోటా కింద ఇచ్చే ఇండ్లతో సంబంధం లేకుండా ఆదివాసులకు సీఎం కోటా కింద ప్రత్యేకంగా ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. జనాభా ప్రాతిపదికన ఈ ఇండ్లు ఇచ్చేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాన్ ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీలకు ఇండ్ల్లు కేటాయిస్తామని సీఎం తెలిపారు. ఆదివాసీ రైతులకు ఉచితంగా సోలార్ మోటార్లు (వంద శాతం రాయితీ) అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇందిర జలప్రభ కింద ఉచితంగా బోర్లు వేసే అంశంపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సీఎం అధికారులకు సూచించారు. ఉచితంగా సోలార్ పంపుసెట్లతో పాటు ఇండ్లకు సోలార్ ద్వారా విద్యుత్ అందించేందుకు ప్రయత్నిస్తామని సీఎం చెప్పారు. ఆదివాసీ గూడేల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలనీ, ఇందు కోసం ఐటీడీఏల పరిధిలో వెంటనే స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
కేస్లాపూర్ జాతరకు నిధులు
కేస్లాపూర్ జాతరకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివాసీలకు ఎంతో కీలకమైన రాయి సెంటర్లకు భవనాల నిర్మాణం చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాయి సెంటర్ల నిర్మాణం, అందుకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలు, ఎన్ని భవనాలు అవసరమనే దానిపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆయా భవనాలు ఎలా ఉండాలనే దానిపై పంచాయతీరాజ్ శాఖ నుంచి నమూనాలు తయారు చేయించాలని మంత్రి సీతక్కకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ప్రొఫెసర్ గుమ్మడి అనురాధ, ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.