రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

నవతెలంగాణ – ఉత్తర ప్రదేశ్‌ : నోయిడాలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఓ హౌసింగ్‌ కాంప్లెక్స్‌లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధురాలిపైకి ఎస్‌యూవీకారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో సదరు వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.సెక్టార్‌ 78లోని మహాగున్‌ మోడ్రన్‌ సొసైటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కృష్ణ నారంగ్‌ (75) అనే వృద్ధురాలు గురువారం సాయంత్రం సమయంలో వాకింగ్‌కు వెళ్లింది. ఆమె వాకింగ్‌ చేస్తున్న సమయంలో బేస్‌మెంట్‌ నుంచి వచ్చిన ఓ కారు ప్రమాదవశాత్తు కృష్ణ నారంగ్‌ను డీ కొట్టింది. దీంతో ఆ వృద్ధురాలు కారు చక్రాలకింద నలిగిపోయి తీవ్ర గాయాలపాలైంది. అనంతరం బాధితురాలిని కారు డ్రైవర్‌ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు నోయిడా డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ హరీష్‌ చంద్ర తెలిపారు. దర్యాప్తు అనంతరం డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

Spread the love