– వ్యవసాయం, విద్యా, రైల్వే రంగాలు కుదేలు
– ఎంఎస్ స్వామినాథన్కు భారతరత్న ఇస్తారు..
– ఆయన చేసిన సిఫారసులు అమలు చేయరు
– పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్ దద్దరిల్లింది. ఎన్డీఏ ప్రభుత్వ హయంలో దేశంలోని వ్యవసాయం, విద్యా, రైల్వే రంగాలు కుదేలు అయ్యాయని ప్రతిపక్షాలు విమర్శించాయి. గురువారం లోక్సభలో విద్యా, రైల్వే రంగాల బడ్జెట్పై చర్చ జరగ్గా, రాజ్యసభలో వ్యవసాయ రంగంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ బికాష్ రంజన్ భట్టాచార్య మాట్లాడుతూ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్కు భారతరత్న ఇస్తారని, కానీ ఆయన వ్యవసాయ రంగంపై ఆయన చేసిన సిఫారసులు విస్మరించారని ధ్వజమెత్తారు. ఆయన సూచనలులు విస్మరించడమంటే, ఆయనను అగౌరవపరచడమేనని అన్నారు. ప్రధాని మోడీ చేసిన కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలను రైతులు ఎలా తిప్పికొట్టారో ప్రపంచం మొత్తం చేసిందని అన్నారు. రైతుల సమస్యలను, వ్యవసాయ సంక్షోభాన్ని ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు పెరిగాయని, వీటిని నివారించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని దుయ్యబట్టారు. కార్పొరేట్లకు రుణమాఫీ చేసే ప్రభుత్వం, రైతులకు ఎందుకు రుణమాఫీ చేయటం లేదని ప్రశ్నించారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) చట్టం చేయాలని రైతులు డిమాండ్ చేస్తోన్నారని, కానీ మోడీ సర్కార్ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. పలుమార్లు పీఎం కిసాన్ గురించి మాట్లాడుతున్నారని, అయితే రెండున్నరేండ్లలో 1.54 కోట్ల మంది రైతులను పీఎం కిసాన్ నుంచి తొలగించారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా విమర్శించారు. నిర్ణయించిన కనీస మద్దతు ధరకు ప్రభుత్వం పంటను కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు.
విద్యా స్వేచ్ఛలో బలహీనత
బీజేపీ ప్రభుత్వ హయంలో విద్యా స్వేచ్ఛ బలహీనపడిందని కాంగ్రెస్ ఎంపీ ఆంటోని విమర్శించారు. లోక్సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని దుయ్యబట్టారు. ”ఈ దేశంలోని విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ లేదు. విద్యా స్వేచ్ఛ గణనీయంగా బలహీనపడింది. విద్యా రంగంలో భయానక వాతావరణం ప్రవేశించింది” అని ఆయన విమర్శించారు.
రైల్వే మంత్రి కాదు…రీల్ మంత్రి
గత రెండు నెలల్లో నాలుగు గూడ్స్ రైళ్లు పట్టాలు తప్పాయని, ఈ ప్రమాదాల్లో 14 మంది మరణించినా రైల్వే శాఖ మంత్రి ఎలాంటి నైతిక బాధ్యత వహించలేదని కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గొగొరు విమర్శించారు. నైతిక బాధ్యత వహించకపోగా రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ ప్రతిపక్షాల మీద విరుచుకుపడుతున్నారని ఎద్దేవా చేశారు. గత ఏడాది బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదంలో ఏకంగా 300 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. గత ఒకటి రెండు సంవత్సరాలుగా రైలు ప్రమాదాలు పెరుగుతున్నా రైల్వే మంత్రి మాత్రం తనకేమీ పట్టనట్టు రీల్స్ చేయడంలో మునిగిపోయారని విమర్శించారు. ఆయన రైల్వే మంత్రి కాదని రీల్ మినిస్టర్, డిరైల్మెంట్ మినిస్టర్ అని ఎద్దేవా చేశారు. దేశంలో వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏ ఒక్కరూ బాధ్యత తీసుకోకపోవడం బీజేపీ సంప్రదాయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైలు ప్రమాదాలపై మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన సంతృప్తికరంగా లేదని, అందుకే ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయని కాంగ్రెస్ గౌరవ్ గొగొరు పేర్కొన్నారు.
ప్రతిపక్షాలపై రైల్వే మంత్రి దాడి
తమ ప్రభుత్వం హయంలో ఏం చేశారో చెప్పమంటే, దానికి సమాధానం చెప్పకుండా ప్రతిపక్షాలపై రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ దాడికి దిగారు. 58 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కేవలం ఒక కిలోమీటర్ ట్రాక్కు కూడా వారు ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ఏటీపీ) నెలకొల్పలేదని అన్నారు. మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా పనిచేసిన సమయంలో రైలు ప్రమాదాలు 0.24 శాతం నుంచి 0.19 శాతానికి తగ్గాయని చెప్పగానే బల్లలు చరిచారని, తాము రైలు ప్రమాదాలను 0.19 శాతం నుంచి 0.3 శాతానికి తగ్గించినా తమను నిందిస్తున్నారని, ఈ రకంగా దేశాన్ని నడపగలమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో తన ట్రోల్ ఆర్మీతో తప్పుడు విషయాలను ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ తన దుష్ప్రచారంతో రైల్వేల్లో ప్రతిరోజూ ప్రయాణించే రెండు కోట్ల మంది ప్రజల గుండెల్లో గుబులు రేపుతోందని, ప్రయాణీకులను భయపెట్టడమే ఆ పార్టీ ఉద్దేశమా అని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రశ్నించారు. రైళ్లలో మూడింట రెండు వంతుల నాన్ ఏసీ కోచ్లు, మూడోవంతు ఏసీ కోచ్లు ఉంటాయని, జనరల్ కోచ్లకు పెరిగిన డిమాండ్ దృష్ట్యా ప్రతి మెయిల్, ఎక్స్ప్రెస్ ట్రైన్లో కనీసం నాలుగు జనరల్ కోచ్లు ఉండేలా చూస్తామని చెప్పారు. ఇందుకోసం 2,500 జనరల్ కోచ్లు త్వరలో సిద్ధమవుతాయని మంత్రి తెలిపారు.