విద్యార్థుల ఆత్మహత్యలపై తెలంగాణ హైకోర్టులో పిల్

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్టంలో విద్యార్థుల ఆత్మహత్యలపై హైకోర్టులో పిల్ దాఖలైంది. రాష్టంలో ప్రతి సంవత్సరం టెన్త్, ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని న్యాయవాది శంకర్ ఈ పిల్ దాఖలు చేశారు. ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ప్రతి ఎగ్జామ్ హల్ టికెట్స్‌పై హెల్ప్ లైన్ సెంటర్ నెంబర్ ఇవ్వాలని న్యాయవాది పిల్‌లో పేర్కొన్నారు. 10వ తరగతి టెస్ట్ బుక్‌లో ఒక సిలబస్ పెట్టాలని, ఆత్మహత్య చేసుకున్న కుటుంబ పరిస్థితులు తెలిసేలా వాళ్లకు అవగాహన రావాలని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రవీణ్ కుమార్ న్యాయస్ధానాన్ని కోరారు. గతంలో ప్రభుత్వం రోషిని అనే కార్యక్రమం పెట్టినా ఎలాంటి ఉపయోగం లేదని ఆయన అన్నారు. పిల్‌పై విచారించిన హైకోర్టు ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రధాన కార్యదర్శి, స్కూల్ సెకండరీ బోర్డు కమిషనర్, ఇంటర్ బోర్డు కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. 15 ఏళ్ల నుంచి ఎంత మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారో పూర్తి వివరాలు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశిస్తూ.. తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.

Spread the love