ప్రజాపక్షం ఎర్రజెండా

Prajapaksa is a red flag– ఉద్యమాలే మా ఎజెండా
– దేశానికి మోడీ పీడ
– వదిలించుకొనేందుకు ప్రజలు సిద్ధం కావాలి
– బీజేపీకి గులాంగిరీ చేసే వారిని ఓడించాలి : సీపీఐ(ఎం) ప్రజారక్షణ భేరి బహిరంగసభలో వక్తలు
– బెజవాడలో ఎర్ర కవాతు
– వేలాది మందితో భారీ ర్యాలీ
అమరావతి: దేశానికి, రాష్ట్రానికి పట్టిన బీజేపీ, మోడీ పీడను వదిలించుకునేందుకు ప్రజలు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) పిలుపునిచ్చింది. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా ద్రోహం చేసిన బీజేపీకి ఎవరు మద్దతిచ్చినా వారిని ఎన్నికల్లో ఓడించాలని ఉద్బోధించింది. ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై ప్రజా ప్రణాళిక రూపొందించామని, దానిపై ప్రజల్లో చైతన్యం కలిగిస్తామని, అమలు కోసం కలిసొచ్చే అందరినీ కలుపుకొని బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని ప్రకటించింది. ‘అసమానతలు లేని అభివృద్ధి కోసం’ అన్న నినాదంతో ‘ప్రజారక్షణ భేరి’ పేరిట నెల రోజులుగా సీపీఐ(ఎం) ఏపీలోని అన్ని ప్రాంతాలనూ కలుపుతూ మూడు బస్సు జాతాలను విజయవంతంగా పూర్తి చేసింది. జాతాల ముగింపు అనంతరం విజయవాడలో బుధవారం ఫుడ్‌ జంక్షన్‌ నుంచి సభా స్థలి సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం వరకు సాగిన భారీ ర్యాలీ బెజవాడను ఎర్ర సముద్రం కావించింది. సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన సభలో పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌, ఎస్‌ పుణ్యవతి, సీనియర్‌ నాయకులు పి మధు, కార్యదర్శివర్గ సభ్యులు లోకనాథం, డి రమాదేవి, కె ప్రభాకర్‌రెడ్డి, వి వెంకటేశ్వర్లు, కిల్లో సురేంద్ర ప్రసంగించారు.
ఎర్ర జెండాతోనే దేశానికి రక్ష
లౌకిక ప్రజాస్వామ్యం రద్దు, దేశ సంపద లూటీ, సామాజిక న్యాయానికి తూట్లు, సమాఖ్య స్ఫూర్తికి విఘాతం, మొత్తంగా రాజ్యాంగమే మోడీ పాలనలో ధ్వంసం అవుతోందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా ఏమన్నారంటే… దేశ సమైక్యత, సమగ్రత ప్రమాదంలో పడింది. దేశ సంపద అదానీ, అంబానీ పరమవుతోంది. క్రోనీ కేపిటలిజం విశృంఖలమైంది. ఆర్థిక ఆత్మ సంతర్పణ జరుగుతోంది. పెద్ద పెద్ద వాగ్దానాల ప్రచారంతో ప్రజలను మోడీ భ్రమల్లో పెడుతున్నారు. జి20 దేశాల సదస్సులో భారత్‌ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటోందంటున్నారు. ఐదవ స్థానంలో ఉన్న మనం 2027 నాటికి మూడవ స్థానంలోకి ఎవరు ఉన్నా వస్తాం. ఎవ్వరూ ఆపలేరు. మనకు ఉన్న 140 కోట్ల జనాభా ఆ పని చేస్తారు. కానీ తలసరి ఆదాయంలో ప్రపంచంలో మనం 147వ స్థానంలో ఉన్నాం. జి20 దేశాల్లో అట్టడుగున ఉన్నాం. మానవాభివృద్ధిలో చివరిలో ఉన్నాం. నిరుద్యోగంలోనూ అంతే. సామాజిక న్యాయం విషయానికొస్తే మహిళలపై ప్రతిరోజూ 49 దాడులు జరుగుతున్నాయి. ప్రయివేటు మైనింగ్‌ కోసం గిరిజనులపై దాడులు చేస్తున్నారు. ప్రజాస్వామ్యం ఎక్కడుంది? బీమాకొరెగావ్‌ కేసులో ఏండ్లకు ఏళ్లు జైళ్లల్లో పెట్టారు. ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేస్తున్నారు. గవర్నర్లు కేంద్రానికి ఏజెంట్లుగా పని చేస్తున్నారు. విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలు పాస్‌ చేసిన బిల్లులను ఆపొద్దని సాక్షాత్తూ సుప్రీం కోర్టు చెప్పింది. కేరళకు కేంద్రం రూ.పది వేల కోట్లు బకాయిలు చెల్లించట్లేదు. ఈ రోజు మరణించిన తమిళనాడు పార్టీ నేత శంకరయ్యకు ఆ రాష్ట్ర డీఎంకే ప్రభుత్వం గౌరవ డిగ్రి ఇవ్వదలిస్తే గవర్నర్‌ సంతకం పెట్టలేదు. మీడియాపై దాడులు జరుగుతున్నాయి. ఇదీ మోడీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం, ఫెడరలిజం పరిస్థితి. ఎన్నికల కమిషన్‌ సైతం బీజేపీకి అనుకూలంగా పని చేస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో పీఎం కిసాన్‌ డబ్బులు రైతులకు వేయడం మొదలు పెట్టారు. రూ.23 వేల కోట్ల అభివృద్ధి పథకాలు ప్రకటించారు మోడీ. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన అయినా ఈసీ పట్టించుకోలేదు. ఉచిత రేషన్‌ కూడా దగానే. గతంలో ఐదు కిలోలు ఫ్రీగా, మరో ఐదు కిలోలు సబ్సిడీపై ఇచ్చారు. ఇప్పుడు సబ్సిడీపై ఇచ్చే ధాన్యాలను ఎత్తేశారు..అన్నారు..
ఆ పార్టీలే సమాధానం చెప్పాలి
పదేండ్లల్లో బీజేపీ ఈ రాష్ట్రానికి ఏం చేసిందో ఇక్కడి వైసీపీ, టీడీపీ, జనసేన ప్రజలకు సమాధానం చెప్పాలని ఏచూరి డిమాండ్‌ చేశారు.. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీని నిలదీసి, ప్రజా ఉద్యమాలు నిర్మించి, ఒత్తిడి చేసే సత్తా ఒక్క ఎర్ర జెండాకే ఉన్నదన్నారు. వామపక్షాలకు సీట్లు లేవు, వాటి పనైపోయిందంటున్నారు. మా శక్తి ఏమిటో కాంగ్రెస్‌ ఎమర్జెన్సీ విధించినప్పుడు చూశారు. ఇటీవలి నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, దానికి కమ్యూనిస్టులు ఇచ్చిన మద్దతే సమాధానం. అందుకే వామపక్షాల, ప్రజా ఉద్యమాల అవసరం దేశానికి ఉంది. మోడీని గద్దె దిందించాలంటే ప్రజా ఉద్యమాలు రావాలి. ‘ఇండియా’ బ్లాక్‌ మరింత బలోపేతం కావాలి. ఈ రాష్ట్రంలో కూడా మోడీ, ఆయనకు మద్దతిచ్చే పార్టీలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ విధానాల కోసం ప్రజా ఉద్యమాల నిర్వహణకే ప్రజారక్షణ భేరి, ప్రజా ప్రణాళిక… అని చెప్పారు ఏచూరి.
బానిసత్వం వీడండి
రాష్ట్రానికి అన్యాయం, నష్టం చేసిన మోడీ సర్కారుకు ఇక్కడి బీజేపీ, టీడీపీ, జనసేన పల్లకీ మోస్తున్నాయని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతగా బానిసత్వం చేయడం దేనికని ప్రశ్నించారు… ఇక్కడేమో ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటారు, కసిగా తిట్టుకుంటారు. ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలకు పూల గుత్తులిచ్చి ప్రసన్నం చేసుకుంటారు. ఇక్కడ బీజేపీకి ఉనికి లేకపోయినా దేశంలోనే అత్యంత బలంగా ఉంది. పాతిక మంది ఎంపీలు ఉండి కూడాపార్లమెంట్‌లో బీజేపీకి చెయ్యెత్తుతున్నారు. గతంలో ఇక్కడ పని చేసిన ముఖ్యమంత్రులు రాష్ట్రం కోసం కేంద్రాన్ని ఎదిరించి పోరాడారు. ఇప్పుడున్న అధ్వానం ఎప్పుడూ లెక్కడా లేదు. పిరికిపందల్లా కాకుండా స్వతంత్రంగా వ్యవహరించలేరా? గాజాలో ఇజ్రాయల్‌ ఊచకోత కోస్తోంది. మోడీ సర్కారు మద్దతిస్తోంది. ప్రతి ఏడాదీ జగన్‌ జెరూసలేం వెళతారు. కనీసం బీజేపీ వైఖరిపై మాట్లాడరా? బీజేపీ, మోడీ, అమిత్‌షా అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్ట్‌ చేసే దమ్ము జగన్‌కు ఉంటుందా? అయినా బీజేపీని టీడీపీ ఒక్కమాట అనకుండా, పైపెచ్చు కృతజ్ఞతలు తెలుపుతోంది. సిగ్గు లేదా? బిసి గర్జన సభలో మోడీ మూడోసారి రావాలన్నారు పవన్‌ కళ్యాణ్‌. ఏం చేశారని రావాలి, ఆయన అందచందాలకు ముగ్ధులయ్యారా? రాబోయే ఎన్నికల్లో మోడీ పీడ వదిలించుకోవాలి. మోడీకి గులాం చేసే వారినీ ఓడించాలి..అని అన్నారు..
ఎర్ర జెండా ఎదిరిస్తుంది
ప్రజలు, ప్రజా సమస్యలే ఎజెండాగా ఎర్రజెండా పని చేస్తోందని సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ… మాది ప్రజాపక్షం. ప్రజలకు అండగా నిలబడతాం. ప్రజా సమస్యలే లక్ష్యంగా ఉద్యమాలు నిర్మిస్తాం. నెల రోజులుగా నిర్వహించిన ‘ప్రజా రక్షణ భేరి’ బస్సు యాత్రల్లో ప్రజల నుంచి నేరుగా తెలుసుకున్న సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రణాళిక ప్రకటించి, సాధన కోసం ప్రజలను విస్తృతంగా సమీకరిస్తాం. ‘ప్రజారక్షణ భేరి’ రాష్ట్రానికి దిక్సూచి. ప్రజా ప్రణాళికతో అసమానతలు లేని రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఉద్యమాలతో ఒత్తిడి తెస్తాం. రాష్ట్ర రూపు రేఖలు మారుస్తాం. అసెంబ్లీలో ఎర్రజెండా ప్రతినిధులుండాలి. కమ్యూనిస్టుల అవసరం ఉన్నదన్నారు.

Spread the love