– మార్గదర్శకాలు జారీ
– ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార వ్యవస్థ
నవతెలంగాణ న్రపత్యేక ప్రతినిధి-హైదరాబాద్
హైదరాబాద్లోని ప్రజాభవన్లో కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో గల్ఫ్తో పాటు ఇతర దేశాల కార్మికులు, ఎన్నారైల కోసం ఏర్పాటు చేసిన ‘ప్రవాసీ ప్రజావాణి’ ఫిర్యాదుల స్వీకరణ కేంద్రం నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రజావాణి ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గల్ఫ్, ఇతర దేశాల్లో ఉన్న కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం సెప్టెంబర్ 16న జారీ చేసిన జీవో నెం.205కు కొనసాగింపుగా, సాధారణ పరిపాలనా శాఖలోని ప్రవాస భారతీయుల (జీఏడి – ఎన్నారై) విభాగం పక్షాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ నెల 9న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపి) మార్గదర్శకాలను విడుదల చేశారు. ప్రవాసీ ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారానికి సంస్థాగతంగా గట్టి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రవాసీ ప్రజావాణి నిర్వహణ మార్గదర్శకాల ఉత్తర్వుల ప్రతులను శుక్రవారం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా. జి. చిన్నారెడ్డి విడుదల చేశారు. టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి, దుబాయిలోని గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షులు గుండెల్లి నర్సింలు, స్వచ్ఛంద సేవకులు శాంతిప్రియ యాదవ్ (మలేషియా), బషీర్ అహ్మద్ (ఓమాన్ రిటర్న్) తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చేసిన నోడల్ అధికారి దివ్యా దేవరాజన్ను చిన్నారెడ్డి అభినందించారు.
మార్గదర్శకాలు
గల్ఫ్, ఇతర గమ్యస్థాన దేశాల కార్మికులు, ఎన్నారైల కోసం ఏర్పాటు చేసిన ప్రవాసీ ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణ కేంద్రంలో విదేశాల్లో ఉన్న బాధితుల పక్షాన వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయవచ్చు. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవచ్చు. తదుపరి చర్యల కోసం ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపిస్తారు.
జీఏడి-ఎన్నారై విభాగం పరిధిలో..
గల్ఫ్ తదితర దేశాల నుంచి మతదేహాలను ఇండియాకు తెప్పించడం, విదేశాల నుంచి వచ్చిన శవపేటికలను హైదరాబాద్ విమానాశ్రయం దగ్గర నుంచి స్వగ్రామం తీసుకెళ్లేందుకు ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేయడం (దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారికి), పేషెంట్లను స్వదేశానికి రవాణా చేయడం, విదేశీ జైళ్లలో ఉన్నవారికి న్యాయ సహాయం చేసి విడుదలకు కషి చేయడం, వీసా గడువును మించి (ఓవర్ స్టే) అక్కడే నివసించడం, అత్యవసర పరిస్థితులు, క్షమాభిక్ష (ఆమ్నెస్టీ), జీతం బకాయిలు ఇప్పించడం, విదేశాల్లో మన వారికి అవసరమైన అన్ని సేవలను జీఏడి – ఎన్నారై విభాగం నేరుగా పర్యవేక్షిస్తుంది. విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, ఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో అనుసంధానం చేస్తుంది. ఈ సేవలు వినియోగించుకోవడానికి తెల్ల కాగితంపై దరఖాస్తు, పాస్ పోర్ట్ మొదటి పేజీ, అడ్రస్ పేజీ, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, విదేశాల్లోని వివరాలు, తెలంగాణలోని కుటుంబ వివరాలతో పాటు మొబైల్ నెంబర్లు ఇవ్వాలి.
ఎన్నారై మహిళా పోలీస్ విభాగం పరిధిలో
విదేశాల్లోని ఎన్నారై కుటుంబ వివాదాల పరిష్కారం గురించి వచ్చిన దరఖాస్తులను తదుపరి చర్యల కోసం హైదరాబాద్ లక్డీకాపూల్లోని పోలీస్ కార్యాలయంలోని ఎన్నారై మహిళా విభాగానికి పంపిస్తారు. ఈ సేవలు వినియోగించుకోవడానికి తెల్ల కాగితంపై దరఖాస్తు, పాస్ పోర్ట్ మొదటి పేజీ, అడ్రస్ పేజీ, ఆధార్కార్డు, మ్యారేజీ సర్టిఫికెట్, పోలీస్ ఎఫ్ఐఆర్, విదేశంలోని వివరాలు, తెలంగాణలోని కుటుంబ వివరాలు, మొబైల్ నెంబర్లు అందించాల్సి ఉంటుంది.
ఏజెంట్ల మోసాలు – పోలీస్ శాఖ పరిధిలో
నకిలీ ఏజెంట్లు, చీటింగ్ కేసులు, విదేశాలకు సంబంధించిన ఇతర సారూప్య సమస్యలపై తదుపరి చర్యల కోసం సంబంధిత పోలీస్ కమీషనర్(సీపీ), పోలీస్ సూపరింటెండెంట్(ఎస్పీ)కు బదిలీ చేస్తారు. ఈ సేవలు వినియోగించుకోవడానికి తెల్ల కాగితంపై దరఖాస్తు, పాస్ పోర్ట్ తదితర వివరాలు అందజేయాలి.
గల్ఫ్ మతులకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా
రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా (మతధన సహాయం) కోసం గల్ఫ్ దేశాల్లో చనిపోయిన వ్యక్తి జీవిత భాగస్వామి (భార్య లేదా భర్త), పిల్లలు, తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విజ్ఞప్తిని సంబంధిత జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తారు. బాధితులు నేరుగా జిల్లా కలెక్టర్లకూ దరఖాస్తు చేసుకోవచ్చు. తెల్లకాగితంపై అభ్యర్థన లేఖ, పాస్పోర్టు, ఆధార్కార్డు, రేషన్కార్డు, భారత రాయబార కార్యాలయాలు జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాలి.
గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు
గల్ఫ్ కార్మికుల పిల్లలకు ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ల కొరకు వచ్చిన దరఖాస్తులను తదుపరి చర్యల కోసం విద్యాశాఖకు బదిలీ చేస్తారు. తెల్ల కాగితంపై దరఖాస్తు, పాస్ పోర్ట్ మొదటి పేజీ అడ్రస్పేజీ, ఆధార్కార్డు, విద్యార్థి సర్టిఫికెట్లు అందజేయాలి.