తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వండి

Give priority to Telangana– 20 లక్షల ఇండ్లు మంజూరు చేయండి : కేంద్ర పట్టణాభివృద్ధి, హౌసింగ్‌ శాఖ మంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్‌
రాష్ట్రంలో ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా గడిచిన 10 సంవత్సరాలలో పేదల ఇండ్ల నిర్మాణం జరగలేదు. దీంతో ఇండ్ల నిర్మాణానికి ప్రజల నుంచి భారీ ఎత్తున డిమాండ్‌ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణకు అవసరమైన ఇండ్లను మంజూరు చేయాలలని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ఒక రోజు రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌ రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌లో మంత్రి పొంగులేటి ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఇద్దరు మంత్రులు కలిసి కరీంనగర్‌కు వెళ్లారు. కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన తర్వాత జరిగిన సమావేశంలో కూడా మంత్రి పొంగులేటి హౌసింగ్‌కు సంబంధించి పలు అంశాలను ప్రస్తావించారు. ”గత ప్రభుత్వం గృహ నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. హౌసింగ్‌ విభాగాన్ని నిర్వీర్యం చేసింది. ఉద్యోగులను ఇతర శాఖలలో సర్ధుబాటు చేసింది. ఈ పరిస్ధితుల్లో ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం పేదల ఇండ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. వచ్చే నాలుగు సంవత్సరాల్లో 20 లక్షల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం గృహ నిర్మాణ శాఖను పునరుద్ధరించి, అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సర్వే ప్రకారం రాష్ట్రంలో అర్హత పొందిన ఇల్లు లేని వ్యక్తులు సుమారు 44 లక్షల వరకు ఉన్నారు. లబ్దిదారుల అర్హత, జియో ట్యాగింగ్‌, వారి ప్రస్తుత నివాసం వంటి విషయాలను డాక్యుమెంటేషన్‌ కోసం ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను రూపొందించాం. దీనితో ఇంటింటి సర్వే నిర్వహించాం. 360 డిగ్రీ టూల్‌తో డెస్క్‌ వెరిఫికేషన్‌ జరిగింది. తుది జాబితాల రూపకల్పన కోసం గ్రామసభలు నిర్వహించాం. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో వేగవంతమైన పట్టణీకరణ జరుగుతుంది. 26 జిల్లాల్లోని 6,867 గ్రామాలను ఇటీవల యూడీఏ కిందికి తీసుకురావడం జరిగింది. వీటిని కేంద్ర ప్రభుత్వ పోర్టల్‌లో చేర్చాలి ” అని మంత్రి విజ్ఞప్తి చేశారు. ”ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన ఫేజ్‌ -1 ప్రకారం దేశ వ్యాప్తంగా రెండు కోట్ల ఇండ్లు మంజూరు కాగా తెలంగాణకు 1.58 లక్షల ఇండ్లు మాత్రమే మంజూరయ్యాయి. ఇది మొత్తం మంజూరులో 0.79 శాతం. భారతదేశ పట్టణ జనాభాలో తెలంగాణ 8 శాతం కలిగి ఉంది. ఈ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రం మరో 24 లక్షల ఇండ్లను పొందడానికి అర్హత కలిగి ఉంది. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన అర్బన్‌ పధకం (2.0) కింద కనీసం 20 లక్షల ఇండ్లను మంజూరు చేయాలి ” అని మంత్రి పొంగులేటి కోరారు.

Spread the love