– వామపక్ష పార్టీల సమావేశం పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వ నిరంకుశ ధోరణులకు వ్యతిరేకంగా శనివారం నిరసన కార్యక్రమాలను చేపట్టాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. వాటిని జయప్రదం చేయాలని కోరాయి. వామపక్ష పార్టీల సమావేశాన్ని హైదరాబాద్లోని ఎంబీ భవన్లో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య, డీజీ నరసింహారావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్ బాల మల్లేష్, సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రమ, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్, ఎస్యూసీఐ(సీ) నాయకులు తేజ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు కోటేశ్వరరావు, సీపీఐ (ఎంఎల్) నాయకులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ నిరంకుశ ధోరణులను తీవ్రంగా ఖండించారు. దీన్ని వ్యతిరేకిస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహించేందుకు నిర్ణయించామని తెలిపారు. అందులో భాగంగా శనివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్రోడ్స్లో నిరసన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తూ, ప్రజాతంత్ర హక్కులను కాలరాస్తున్నదని విమర్శించారు. స్వచ్ఛందంగా పనిచేసే సంస్థలైన ఈడీ, ఐటీ, సీబీఐలను తమ జేబు సంస్థలుగా వాడుకుంటున్నదని తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చట్ట ఉల్లంఘనలు జరుగుతున్నా పట్టించుకోకుండా, బీజేపీయేతర రాష్ట్రాల్లో మాత్రం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష పార్టీల నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నదని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్తోపాటు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితలను అరెస్టుల పర్వం కొనసాగించిందని విమర్శించారు. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్యాంక్ అక్కౌంట్లను సీజ్ చేసి ఎన్నికల్లో దెబ్బతీయాలని చూస్తున్నదని తెలిపారు. ఇలాంటి నిరంకుశ విధానాలను తిప్పికొట్టాలనీ, శనివారం జరిగే నిరసన కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని ప్రజలకు వారు విజ్ఞప్తి చేశారు.