సమరానికి సై…

– కారుతో ఢీ అంటే ఢీ
– మరింత ఐక్యతను ప్రదర్శిద్దాం
– అందరి ఆమోదంతోనే చేరికలు
– ఉన్నవారికి నష్టం జరగొద్దు
– చేరిన వారికి ఇబ్బందులుందొద్దు : కాంగ్రెస్‌ సీనియర్ల నిర్ణయం

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ ఎన్నికలకు రెఢ అవుతున్నది. కారుతో ఢీ అంటే ఢీ అంటున్నది. ఎన్నికల యుద్ధానికి పార్టీని అంతర్గతంగా బలోపేతం చేసుకుంటున్నది. అందులో భాగంగా పార్టీలో చేరే వారితో స్థానికంగా తలెత్తే సమస్యలపై ఆ పార్టీ నేతలు చర్చించారు. పాత నాయకులకు, కొత్తగా పార్టీలో చేరేవారికి మధ్య పొరపొచ్చాలు రాకుండా చాక చాక్యంగా వ్యవహరించాలని సీనియర్లు నిర్ణయించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో వారు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ రాష్ట్ర ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, నేతలు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, పొన్నాల లక్ష్మయ్య, కోదండరెడ్డి, షబ్బీర్‌ అలీ, జూపల్లి కృష్ణారావు, అంజన్‌కుమార్‌ యాదవ్‌, సంపత్‌కుమార్‌తో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ అంతర్గత పరిస్థితులు, పార్టీలో చేరుతున్న వారి రాజకీయ భవిష్యత్తుకు భరోసా, పార్టీలో చేరికలు, అగ్రనేతల పర్యటనలు, ఎన్నికల హామీలు, ప్రచారాంశాలపై చర్చించారు. త్వరలో పీఏసీ సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించారు. ‘విబేధాలను పక్కన పెట్టి కలిసి పనిచేద్దాం.. కర్నాటక తరహాలో రాష్ట్రంలో కూడా కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొద్దాం’ అని నిర్ణయించారు. పార్టీలోకి ఎవరోచ్చినా అందరి ఆమోదంతోనే చేర్చుకోవాలని వారు నిర్ణయించినట్టు తెలిసింది. కొత్త, పాత నేతల కలయికతోనే ఎన్నికలకు సిద్ధం కావాలని అభిప్రాయపడ్డారు. సమావేశానంతరం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ… ఎన్నికల యుద్దానికి ఇక వంద రోజులే మిగిలి ఉందన్నారు. ఈ యుద్ధంలో ప్రజలు గెలవాలని పిలుపునిచ్చారు. పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా అందరం కలిసి పరిష్కరించుకోవాలని కోరారు. త్వరలో బస్‌ యాత్ర చేపడతామన్నారు.
30న కొల్లాపూర్‌లో భారీ బహిరంగ సభ ప్రియాంక హాజరు
ఏఐసీసీ అగ్రనేత ప్రియాంకగాంధీ ఈనెల 30న కొల్లాపూర్‌కు రానున్నారు. ఆ సభలో మహిళా డిక్లరేషన్‌ ప్రకటిస్తామని కోమటిరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ కుటుంబం తప్ప ఎవరు బాగుపడలేదన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో బీసీని సీఎం చేస్తానని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. తలసాని ఓ విగ్గ్గ్‌రాజ్‌…ఆయన ఎప్పుడేం మాట్లాడుతారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ బలోపేతంపై చర్చించామన్నారు. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ద్వారా 26 పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయని గుర్తు చేశారు. ఓబీసీ జనగణన చేపట్టేందుకు రాహుల్‌ ఇప్పటికే హామీ ఇచ్చారని తెలిపారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ మిత్ర పక్షాలను చీల్చడం, బలహీన పరచడమే బీజేపీ పనిగా పెట్టుకుందని విమర్శించారు. మోడీ ఫోటోతో దేశం అభివృద్ధి కాదన్నారు.
కాంగ్రెస్‌లో చేరుతున్న నేతలు వీరే…
ముగ్గురు మహిళా జడ్పీ చైర్‌పర్సన్‌లు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. రంగారెడ్డి జిల్లా చైర్‌పర్సన్‌ తీగల అనిత రెడ్డి, వికారాబాద్‌ జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీత మహేందర్‌ రెడ్డి, గద్వాల జడ్పీ చైర్‌పర్సన్‌ సరితా తిరుపతయ్య కాంగ్రెస్‌ లో చేరనున్నారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, వేముల వీరేశంతోపాటు మందుల సామెల్‌, రామారావు పటేల్‌, కోదాడకు చెందిన శశిధర్‌రెడ్డి, ఆరెంజ్‌ ట్రావెల్స్‌ అధినేత సునీల్‌ రెడ్డి తదితరులు గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. డాక్టర్‌ విజయరామారావు, యెన్నం శ్రీనివాసరెడ్డి, ఏ చంద్రశేఖర్‌ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో వ్యక్తగతంగా సర్వేలు చేయించుకోవడంతో అక్కడ కమలం ఓడిపోతుందని తేలినట్టు తెలిసింది. దీంతో వారు కూడా హస్తం గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

Spread the love