ప్రతిపక్ష నేతగా రాహుల్‌ గాంధీ

ప్రతిపక్ష నేతగా రాహుల్‌ గాంధీ– సీడబ్ల్యూసీ తీర్మానం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌ గాంధీని నియమించాలని కోరుతూ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీర్మానం చేసింది. శనివారం నాడిక్కడ అశోక హౌటల్‌లో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ సీనియర్‌ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, కెసి వేణుగోపాల్‌, గౌరవ గొగోరు సహా సీడబ్ల్యూసీ సభ్యులు పాల్గొన్నారు. సమావేశ అనంతరం ఆ పార్టీ సీనియర్‌ నేత కెసి వేణుగోపాల్‌ విలేకరుల సమావేశంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత పదవి చేపట్టాలని రాహుల్‌ గాంధీని సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా కోరిందని తెలిపారు. పార్లమెంటు లోపల ప్రతిపక్షానికి నాయకత్వం వహించడానికి రాహుల్‌ సరైన వ్యక్తి అని అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ చేసిన అలుపెరగని కృషిని సీడబ్ల్యూసీ తీర్మానం ప్రశంసించింది.
”కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దేశవ్యాప్తంగా చేసిన భారత్‌ జోడో యాత్ర, భారత్‌ జోడో న్యారు యాత్ర కాంగ్రెస్‌ను దేశ ప్రజలకు మరింత దగ్గరగా చేసింది. ఆయన ఆలోచనలను, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఈ రెండు యాత్రలు దేశ రాజకీయాల్లో చారిత్రాత్మక మలుపులు తిప్పాయి. లక్షలాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది ఓటర్లలో ఆశలు, విశ్వాసాన్ని ఈ రెండు యాత్రలు నింపాయి” అని సీడబ్ల్యూసీ తీర్మానంలో పేర్కొన్నారు.
”రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారం సింగిల్‌ మైండెడ్‌గా, పదునైనదిగా, సూటిగా సాగింది. 2024 ఎన్నికల్లో రాజ్యాంగ పరిరక్షణను ఆయన ప్రధాన అంశంగా చేశారు. ఎన్నికల ప్రచారంలో చాలా శక్తివంతంగా ప్రతిధ్వనించిన పాంచ్‌ న్యారు-పచీస్‌ హామీ కార్యక్రమం రాహుల్‌ యాత్రల ఫలితం. ఇందులో ప్రజలందరి భయాలు, ఆందోళనలు, ఆకాంక్షలు, ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు, కార్మికులు, దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, మైనారిటీల ఆకాంక్షలు ప్రతిబింబించాయి” అని ఆ తీర్మానంలో పేర్కొన్నారు.లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత పదవిని స్వీకరించడానికి రాహుల్‌ గాంధీ అంగీకరించారా? అని ప్రశ్నించగా, త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ చెప్పారు. తమ నాయకుడు, కార్యకర్తలను ఉత్సాహపరచడంతో కాంగ్రెస్‌ పునరుజ్జీవనం ప్రారంభమైందని వేణుగోపాల్‌ తెలిపారు. సీడబ్ల్యూసీలో నాలుగు నెలల క్రితంతో పోలిస్తే వాతావరణం పూర్తిగా భిన్నంగా, ఉత్సాహంగా ఉందని ఆయన అన్నారు. ‘రాహుల్‌ గాంధీ కచ్చితంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత కావాలి. ఇది మా కార్యవర్గ అభ్యర్థన. ఆయన నిర్భయుడు, ధైర్యవంతుడు’ అని సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ ప్రమోద్‌ తివారీ అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహా, కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య, మంత్రులు డీకే శివకుమార్‌, హిమాచల్‌ సీఎం సుక్విందర్‌ సింగ్‌ సుకు, ఏపీ నుంచి రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, జెడి శీలం, పల్లంరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. రాత్రి ఎంపీలతో రాహుల్‌ గాంధీ విందు సమావేశం ఏర్పాటు చేశారు.

Spread the love