– ప్రొటెం స్పీకర్కు సోనియా లేఖ
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ అంశంలో అధికార, ప్రతిపక్షాల మధ్య వివాదం తలెత్తి సభాపతి ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించేందుకు ముందుకొచ్చారు. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ అధిష్ఠానం ఇప్పటికే ఆయన్ను లోక్సభ ప్రతిపక్ష నేతగా ఎంపిక చేసినప్పటికీ.. రాహుల్ తన నిర్ణయాన్ని పెండింగ్లో ఉంచారు. 18వ లోక్సభకు సంబంధించి బుధవారం స్పీకర్ ఎన్నిక జరుగుతున్న తరుణంలో.. ప్రతిపక్ష కూటమినంతా ఏకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష నేత బాధ్యతలను రాహుల్ స్వీకరించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి జరిగిన ప్రతిపక్ష పార్టీల భేటీలో నాయకుల అభిప్రాయం మేరకు తన నిర్ణయాన్ని వెలిబుచ్చారు. ఈమేరకు ప్రొటెం స్పీకర్కు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) నేత సోనియా గాంధీ లేఖ ద్వారా సమచారం పంపారు. దీంతో గత పదేండ్ల కాలంలో తొలిసారిగా లోక్సభలో ప్రతిపక్షనేత ఉన్నట్లయింది.