నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణలో బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలించిది. మునుగోడు మాజీ ఎమ్మేల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. కార్యకర్తల అభీష్టం మేరకే తాను పార్టీ వీడుతున్నట్టు ఆయన ప్రకటించారు. ఎల్లుండు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు.
గతేడాది కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మేల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నికల బరిలో నిలిచారు. 2022 నవంబర్లో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అనంతరం బీజేపీలోనే కొనసాగినా.. పార్టీ కార్యక్రమాలకు మాత్రం కాస్త దూరంగానే ఉన్నారు. అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తూ.. అప్పుడప్పుడు మాత్రమే బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర, కేంద్ర నాయకత్వంపై ఆయన గతకొంత కాలంగా అసతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆయన పార్టీ మారనున్నారని.. కాంగ్రెస్ గూటికి చేరుతారని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతున్నా.. ఎప్పటికప్పడు ఆ వార్తలను ఖండిస్తూ క్లారిటీ ఇస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి హవా తగ్గిపోవటం, కాంగ్రెస్ బలం పుంజుకుంటడంతో ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరి మరోసారి మునుగోడు నుంచే బరిలోకి దిగాలని ఆయన యోచిస్తున్నారట. కాగా, ఆదివారం బీజేపీ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాలో ఆయన పేరు లేదు. మునుగోడులు ఇప్పటికీ కాంగ్రెస్ బలంగా ఉండటం, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ వైపు గాలి వీస్తుండటంతో ఆయన పార్టీ మార్పుపై రాజకీయ వర్గాల్లో ఉన్న చర్చను నిజం చేస్తూ ఆయన ప్రకటన చేశారు.