నవతెలంగాణ హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటి (మంగళవారం) సాయంత్రం ముగిసింది. శ్రమజీవి పార్టీ తరఫున జాజుల భాస్కర్, భోజరాజు కోయల్కర్, స్వతంత్ర అభ్యర్థిగా కిరణ్ రాథోడ్లు నామినేషన్లు దాఖలు చేశారు. రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయాలనుకునే ఒక్కో అభ్యర్థికి మద్దతుగా కనీసం 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు మినహా.. మిగిలిన ముగ్గురికి మద్దతుగా ఎమ్మెల్యేలెవరూ సంతకాలు చేయలేదు. దీంతో వారి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ఉపేందర్రెడ్డి తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా రేణుకాచౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర నామినేషన్లు మాత్రమే మిగిలాయి. రాష్ట్రంలో 3 స్థానాలకు బరిలో ముగ్గురే మిగలడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి అనంతరం ఇద్దరు కాంగ్రెస్, ఒక బీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిట్నరింగ్ అధికారి ప్రకటించనున్నారు.