అర్హులందరికీ రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు

జిల్లా కలెక్టర్లతో మంత్రులు పొంగులేటి, తుమ్మల, ఉత్తమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌– గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ
– రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
– జిల్లా కలెక్టర్లతో మంత్రులు పొంగులేటి, తుమ్మల, ఉత్తమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌ కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రేషన్‌ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరంతర ప్రక్రియని, చివరి లబ్దిదారుల వరకు అందిస్తామని ప్రకటించారు. ఇందులో ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులను స్వీకరించడంతో పాటు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించాలని కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న రేషన్‌ కార్డుల లబ్దిదారుల జాబితా కులగణన (సామాజిక) సర్వే ఆధారంగా తయారు చేసిందనీ, ఇది తుది జాబితా కాదని పేర్కొంది. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, గ్రామ సభల నిర్వహణ, తదితర అంశాలపై శనివారం డాక్టర్‌.బి.ఆర్‌.అంబేద్కర్‌ సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26వ తేదీ నుంచి ప్రతిష్టాత్మకంగా నాలుగు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టబోతుందని తెలిపారు. రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామ సభల్లో దరఖాస్తులను స్వీకరించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా కూడా కొత్త రేషన్‌ కార్డులకు లేదా కొత్త సభ్యుల చేర్పులకు దరఖాస్తులు కూడా స్వీకరించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే , గతంలో జరిగిన ప్రజాపాలన సదస్సులలో స్వీకరించిన దరఖాస్తుల జాబితాలో అర్హులైన వారిని గుర్తించే ప్రక్రియ పురోగతిలో ఉందని తెలిపారు. ఈ నెల 26న ప్రారంభించే నాలుగు పథకాలపై 21వ తేదీ నుంచి ప్రారంభమయ్యే గ్రామసభల్లో ప్రజా అభిప్రాయాలు/ ఫీడ్‌ బ్యాక్‌లను తీసుకోవడంతో పాటు ఈ గ్రామ సభలు, ప్రజా పాలన సేవా కేంద్రాలలో కొత్తగా తీసుకున్న దరఖాస్తులు, ఎండీఓ కార్యాలయంలో ఇప్పటికే ఉన్న దరఖాస్తులను తగు రీతిలో పరిశీలించిన తర్వాత మాత్రమే అర్హులైన లబ్దిదారుల తుది జాబితాను ప్రకటించనున్నట్టు మంత్రులు స్పష్టం చేశారు. అర్హులైన తుది జాబితాలను ప్రకటించడానికి ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇంటి స్థలం ఉన్న వారి జాబితా, ఇంటి స్థలం లేని వారి జాబితాతో కలిపి రెండు జాబితాలను గ్రామ సభల్లో ప్రదర్శించాలనీ, అలాగే కొత్తగా గ్రామ సభల్లో వచ్చే దరఖాస్తులను కూడా పరిశీలించాలని సూచించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌ కార్డులను ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. రేషన్‌ కార్డుల మంజూరుకు దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతీ భూమికి రైతు భరోసా కల్పించనున్నట్టు తెలిపారు. గతంలో వివిధ ప్రాజెక్టులకు, రహదారులకు, ఇతర ప్రభుత్వ అవసరాలకు ప్రభుత్వం సేకరించిన భూముల వివరాలు తహసీల్దార్ల వద్ద ఉన్నాయని అన్నారు. వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా రైతు భరోసా లబ్దిదారులను గుర్తించాలని ఆదేశించారు. ఉపాధి హామీ చట్టంలో కనీసం 20 రోజుల పాటు కూలి పనికి వెళ్లిన వారికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తింపజేయనున్నట్టు తెలిపారు. ప్రతీ కుటుంబంలో మహిళల బ్యాంకు ఖాతాలకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మొత్తాన్ని బదిలీ చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్రంలో 156 గ్రామాలను మున్సిపాల్టీల్లో కలపగా, ఈ గ్రామాల్లో 2023 -24లో జరిగిన ఉపాధి పనుల జాబితాను పరిగణనలో తీసుకోనున్నట్టు వారు స్పష్టం చేశారు.
గ్రామ సభలకు విస్తృత ఏర్పాట్లు చేయండి : సీఎస్‌ శాంతికుమారి
ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే గ్రామ సభలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను సీఎస్‌ శాంతి కుమారి ఆదేశించారు. గతంలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభల మాదిరిగానే 21 నుంచి జరిగే గ్రామ సభలకు కూడా చేపట్టాలని అన్నారు. ప్రతి రోజు ఒక గ్రామ పంచాయతీలో మాత్రమే గ్రామ సభ నిర్వహించాలనీ, ఈ గ్రామ సభలకు హాజరయ్యే ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని స్పష్టం చేశారు.

Spread the love