ఐటి రంగంలో తగ్గిన ఎఫ్‌డిఐలు

– 2022-23లో 22 శాతం పతనం
న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సం వత్సరం 2022-23లో భారత్‌ లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టు బడులు (ఎఫ్‌డిఐ)లు 22 శాతం పతనమై 46 బిలియన్‌ డాలర్లు గా చోటు చేసుకున్నాయని డిపార్ట్‌ మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండిస్టీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డిపిఐఐటి) గణంకాలు తెలిపాయి. ముఖ్యంగా కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో ఎఫ్‌డిఐలు తగ్గాయని వెల్లడించింది. ఇంతక్రితం ఏడాది 2021-22లో 58.77 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డిఐలు నమోదయ్యాయి. ఈక్విటీ, ఇతర పెట్టుబడులను కలిపి స్థూలంగా 2022-23లో 16.3 శాతం పతనమై 70.97 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయని డిపిఐఐటి తెలిపింది. ఇంతక్రితం ఏడాదిలో 84.83 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డిఐలు చోటు చేసు కున్నాయి. తయారీ రంగం, కంప్యూటర్‌ సర్వీసెస్‌, కమ్యూనికేషన సర్వీసెస్‌లో అధికంగా ఎఫ్‌డిఐలు పడిపోయాయి.
2022-23 ఏప్రిల్‌ నుంచి మార్చి కాలంలో సింగపూర్‌ నుంచి అత్యధికంగా 17.2 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డిఐలు వచ్చాయి. మారిషాస్‌ నుంచి 6.13 బిలియన్లు, అమెరికా నుంచి 6 బిలియన్లు, యుఎఇ నుంచి 3.35 బిలియన్ల పెట్టుబడులు నమోదయ్యాయి. నెథర్లాండ్స్‌ నుంచి 2.5 బిలియన్లు, జపాన్‌ (1.8 బిలియన్లు), బ్రిటన్‌ (1.73 బిలియన్లు), సైప్రస్‌ (1.27 బిలియన్లు) తదితర దేశాల నుంచి పెట్టుబడులు వచ్చాయి. మారి షాస్‌, అమెరికా, నెథర్లాండ్స్‌, జర్మనీ దేశాల నుంచి వచ్చే ఎఫ్‌డిఐల్లో అధిక తగ్గుదల చోటు చేసుకుంది. 2021-22లో ఆటోమొబైల్‌ రంగంలోకి 7 బిలియన్ల పెట్టుబడులు రాగా.. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 1.9 బిలియ న్లు మాత్రమే వచ్చాయి. 2022-23లో మహారాష్ట్రలోకి అత్యధికంగా 14.8 బిలియన్ల పెట్టుబడులు వచ్చినప్పటికీ.. ఇంతక్రితం ఏడాది 15.44 బిలియన్లతో పోల్చితే తక్కువగానే నమోదయ్యాయి. కర్నాటక రాష్ట్రంలోకి 10.42 బిలియన్లు, గుజరాత్‌లోకి 4.71 బిలియన్ల చొప్పున వచ్చాయి. తమిళనాడు, తెలంగాణ, హర్యాణ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోకి వచ్చే ఎఫ్‌డిఐల్లో తగ్గుదల చోటు చేసుకుంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఈక్విటీ రంగంలోకి వచ్చే ఎఫ్‌డిఐల్లో భారీ తగ్గుదల నమోదయ్యింది.

Spread the love