– ఎన్సీఈఆర్టీకి 33 మంది విద్యావేత్తల లేఖ
– పాఠ్యాంశాల తొలగింపుతో ప్రమాదంలో సృజనాత్మకత
న్యూఢిల్లీ : పాఠ్యాంశాలు తొలగించిన పాఠ్యపుస్తకాల నుంచి తమ పేర్లను తీసివేయాలని మరో 33 మంది విద్యావేత్తలు ఎన్సీఈఆర్టీని కోరారు. ఇప్పటికే ఇద్దరు మాజీ ఎన్సీఈఆర్టీ సలహాదారులు యోగేంద్ర యాదవ్, సుహాస్ పల్షికర్ పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకాల నుంచి తమ పేర్లను తొలగించాలని కోరిన విషయం తెలిసిందే. ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లానీకి లేఖ రాసిన వారిలో అశోక విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్స్లర్, రాజకీయ శాస్త్రవేత్త ప్రతాప్ భాను మెహతా, ఢిల్లీ విశ్వవిద్యాల యానికి చెందిన రాధికా మీనన్, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నివేదిత మీనన్, కాంతి ప్రసాద్ బాజ్పారు, నేషనల్ యూనివర్సిటీ సింగపూర్ వైస్-డీన్, జేఎన్యూ మాజీ ప్రొఫెసర్ రాజీవ్ భార్గవ తదితరులు ఉన్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈ ఆర్టీ) పాఠ్యపుస్తకాల్లో మార్పుపై ఆందోళన వ్యక్తం చేస్తూ పాఠ్యపుస్తకాల అభివృద్ధి కమిటీలో భాగమైన 33 మంది విద్యావేత్తలు తమ పేర్లను ప్రస్తుత పాఠ్యపుస్తకాల నుంచి తొలగించాలని కౌన్సిల్ను కోరారు. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ (ఎన్సీఎఫ్) 2005 వెర్షన్ ఆధారంగా 2006-07లో రూపొందించిన పుస్తకాల కోసం పాఠ్యపుస్తకాల అభివృద్ధి కమిటీ లో వీరు సభ్యులు గా ఉన్నారు. ఎన్సీ ఈఆర్టీ పాఠ్యాంశాల తొలగింపు సృజనాత్మకత సామూహిక ప్రయత్నాన్ని ప్రమాదంలో పడేసింది అని పేర్కొన్నారు. ‘ఎన్సీఈఆర్టీ ఇప్పుడు పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేస్తున్నది. కొన్ని విభాగాలను (చాప్టర్లు కూడా) తీసివేయడం, ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివి ఉన్నాయి. ఏది ఉంచాలో, ఏది తీసివేయాలో నిర్ణయిం చేది ఎవరు అనేది పారదర్శకంగా లేదు. విద్యా విషయక జ్ఞాన ఉత్పత్తికి ఆధారమని మేం విశ్వసిస్తున్నాము’ అని పేర్కొన్నారు. ‘అసలు పాఠ్య పుస్త కాల్లో అనేక ముఖ్యమైన పునర్విమర్శ లున్నందున, వాటిని వివిధ పుస్తకాలు గా రూపొందిస్తున్నందున, ఇవి మేం తయారు చేసిన పుస్తకాలు అని చెప్పుకోవడం, వాటితో మా పేర్లను అనుబంధించడం మాకు కష్టంగా ఉంది’ అని విద్యావేత్తలు పేర్కొన్నారు. ఈ సృజనాత్మక సమిష్టి కృషి ప్రమాదంలో పడిందని మేం విశ్వసిస్తు న్నాం. ఈ మార్పు పట్ల చాలా విచారం వ్యక్తం చేస్తూ, ఎన్సీఈఆర్టీ రాజ కీయశాస్త్ర పాఠ్యపుస్తకాల నుంచి పాఠ్య పుస్తక అభివృద్ధి కమిటీ సభ్యులుగా మా పేర్లను తొలగించమని మేం మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం’ అని లేఖలో పేర్కొన్నారు. వివిధ కోణాలు, సైద్ధాం తిక నేపథ్యాల నుంచి రాజకీయ శాస్త్ర వేత్తల మధ్య విస్తృతమైన చర్చలు, సహకారాల ఫలితంగా పాఠ్యపుస్తకాలు వచ్చాయనీ, భారతదేశ స్వాతంత్య్ర పోరాట ఆదర్శాలు, రాజ్యాంగ సభ ఆకాంక్షలు, సూత్రాల గురించి జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి ఉద్దేశించబడ్డాయని 33 మంది విద్యావేత్తలు తమ లేఖలో పేర్కొన్నారు. మన రాజ్యాంగ క్రమం, నాయకులు, ఉద్యమాల పాత్ర, మన సమాఖ్య వ్యవస్థ స్వభావం, భారత ప్రజాస్వామ్య గణతంత్రం, చైతన్యవంతమైన లక్షణాలు ఉన్నాయని తెలిపారు.