నవతెలంగాణ-ఆసిఫాబాద్
విద్యాశాఖలోని సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్డిఓకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలకు వినతిపత్రం అందజేశామని, సోమవారం ఆర్డీఓలకు వినతి పత్రాలు అందించినట్లు తెలిపారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరారు. ఎన్నో ఏండ్లుగా పని చేస్తున్న తమకు కనీస గుర్తింపు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమం ఉదృతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఏ జేఏసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు కొప్పుల మోహన్, అధికార ప్రతినిధి గేదెకార్ సంతోష్ కుమార్, కోశాధికారి నగేష్, సీఆర్పీ ప్రధాన కార్యదర్శి రాజేష్, జిల్లా నాయకులు మిట్ట దేవేందర్, చిట్ల తిరుపతి, చంద్రి సుభాష్, మహేశ్, వేముల సత్యనారాయణ, శ్వేత పాల్గొన్నారు.