రేవంత్ సార్ , నా బిడ్డ పరిస్థితి ఘోరంగా ఉంది… సత్వరం స్పందించిన ప్రజాభవన్

– గుండె జబ్బుతో వచ్చిన పసికందు ‘ఆరోగ్యశ్రీ’ చికిత్స
నవతెలంగాణ హైదరాబాద్:
తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఓ పసికందుకు తీసుకొని ప్రజాభవన్‌కు వచ్చిన తల్లికి సత్వర న్యాయం జరిగింది. ఆ బాలుడికి వెంటనే చికిత్స చేయించాలని నిర్ణయించి ప్రజాభవన్‌ నోడల్ అధికారి దివ్య మానవత్వం చాటారు. వెంటనే ప్రభుత్వ అంబులెన్స్‌లోనే ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయాలని ఆదేశించారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ జియాగూడకు చెందిన ఓ నిరుపేద కుటుంబంలో నాలుగు నెలల బాబుకు ఆరోగ్యం బాగుండకపోవడంతో పలు ఆసుపత్రుల్లో చూపించారు. వైద్యులు గుండెకు రంధ్రం ఉన్నట్టు తేల్చారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకోవాలన్నా రేషన్‌ కార్డులో బిడ్డ పేరు ఉండాలి. ప్రయివేటు ఆసుపత్రుల్లో రూ.లక్షల్లో ఖర్చవుతుందని చెప్పడంతో రెక్కాడితే కాని డొక్కాడని ఆ కుటుంబం డీలా పడింది. ఈ క్రమంలో బిడ్డతో సహా తల్లి సునీత మంగళవారం ఉదయం ప్రజాభవన్‌కు వచ్చి.. నోడల్‌ అధికారిణి దివ్యను కలిశారు. సమస్య వినగానే ఆమె వెంటనే స్పందించారు. అక్కడే ఉన్న వైద్యులకు శిశువు బాధ్యతలు అప్పగించి, చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని, వెంటనే ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించాలని బంజారాహిల్స్‌లోని స్టార్‌ ఆసుపత్రికి సమాచారమిచ్చారు. తల్లీబిడ్డలను వైద్యుల పర్యవేక్షణలో ప్రజాభవన్‌లోనే ఉన్న అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ నిర్ణయంతో తల్లి సునీత, ప్రజాభవన్‌లో వినతి పత్రాలు సమర్పించేందుకు వచ్చిన వారంతా హర్షం వ్యక్తం చేశారు.

Spread the love