ఒకే విడతలో 11 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కులివ్వాలి

– తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్
ఎన్నో పోరాటాల పలితంగా రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ అభినందనలు తెలియజేసింది.రాష్ట్ర ప్రభుత్వం జూన్ 24 నుండి 30 తేదీ వరకు హక్కుపత్రాలు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ఒకేవిడతలో 11 లక్షల ఏకరాల పోడుభుములకు హక్కుపత్రాలివ్వాలని లేకపోతే మరో పోడు రైతు పోరాటానికి సిద్ధం అవుతామని ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్ లో ఎం ధర్మ నాయక్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం డిమాండ్ చేసింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ శాసన సభ్యులు జూలకంటి రంగారెడ్డి , సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్ పాల్గొని ప్రసంగించారు.వివిధ జిల్లాల నుండి రాష్ట్ర ఉపాధ్యక్షులు,సహాయ కార్యదర్శులు,నాయకులు గుగులోత్ ధర్మ,భూక్యా వీరభద్రం,వాంకడోత్ వీరన్న,కొర్ర శంకర్, ఎం రవి నాయక్,ఎం బాలు, పాండు, గన్యా, శ్రీకాంత్,బాల్యానాయక్,అశోక్,పార్వతి,జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుదీర్ఘకాలం గిరిజన సంఘాలు, వామపక్ష పార్టీలు చేసిన పోరాటాల ఫలితంగానే పోడుభుములకు హక్కు పత్రాలు జూన్ 24 నుండి పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిందని అన్నారు.పోడు రైతులపై పెట్టిన కేసులన్నీటీని బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ముఖ్య మంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించినట్టుగానే 11 లక్షల ఏకరాల పోడు భూములకు మొదటి విడతలోనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.కేవలం ఎన్నికల దృష్టిలో పెట్టుకొని కొంత మంది గిరిజనులకు హక్కుపత్రాలు ఇచ్చి చేతులు దులుపు కావాలని చూస్తే మరోపోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.ఇప్పటి వరకు జిల్లాలనుంచి అందిన సమాచారం మేరకు కేవలం 4లక్షల ఏకరాలకు మాత్రమే హక్కుపత్రాలు సిద్ధం చేసినట్లు తెలుస్తోందని అన్నారు.సాటిలైట్ మ్యాపులను చూపెట్టి వేలాదిమంది పోడు రైతుల దరఖాస్తులను తిరస్కరించారని ఆరోపించారు.జూన్ 5 నుండి నెలరోజులపాటు పోడు భూముల ప్రాంతాల్లో పర్యటించి ఎంఆర్వో,కలెక్టర్లకు మెమొరాండాలు ఇవ్వాలని,పోడు హక్కు పత్రాలు పంపిణీ కార్యక్రమంలో గిరిజన సంఘం కార్యకర్తలు ఎక్కడికక్కడ పాల్గొని గిరిజనులకు సక్రమంగా హక్కు పత్రాలు అందే విధంగా చూడాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ద ఉత్సవాల్లోనే గిరిజన బందును ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జూన్ 16వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసనలు తెలుపాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు మెమొండాలు ఇవ్వాలని,కేంద్ర బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలపై జూలైలో రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టాలని తీర్మానించారు.

Spread the love