నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. దీంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అన్ని పార్టీలు ఇప్పటికే పలు రకాల గిఫ్ట్ లతో పాటు విభిన్న రీతిలో నగదును అందజేస్తున్నారు. దీంతో పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే భారీ నగదును పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద మొత్తంలో పట్టుబడుతున్న నగదుతో పాటు బంగారం, బహుమతులను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే, తాజాగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని రఫిక్ అనే వ్యాపార వేత్త, బీఆర్ఎస్ నాయకుడి ఇంట్లో భారీగా నగదును ఐటీ అధికారులు పట్టుకున్నారు. బీఆర్ఎస్ నేత ఇంట్లో సుమారు 5 కోట్ల రూపాయలకు పైగా నగదు పట్టు బడినట్టు ఐటీ అధికారులు పేర్కొన్నారు. డబ్బులు లెక్కించడం కోసం క్యాష్ కౌంటింగ్ మిషన్లను ఆదాయపు పన్ను శాఖ అధికారులు లోపలికి తీసుకెళ్లారు. ఎంత డబ్బును స్వాధీనం చేసుకున్నారు అనే విషయాన్ని అధికారులు ఇంకా ప్రకటించలేదు. ఉదయం నుంచి రఫిక్ జిన్నింగ్ మిల్లులో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఈ డబ్బులు ఎక్కడ నుచి వచ్చింది అంటూ ఐటీ అధికారులు బీఆర్ఎస్ నేత రఫిక్ ను ప్రశ్నిస్తున్నారు.