ఆర్ఎస్ఎస్ భావజాలం దేశానికి ప్రమాదకరం: ఖర్గే..

నవతెలంగాణ – ఢిల్లీ: రాజ్యసభలో విమర్శలు, ప్రతివిమర్శలతో వాతావరణం వేడెక్కింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా… ఆర్ఎస్ఎస్ పై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  యూనివర్సిటీలు, ఎన్ సీఈఆర్ టీ వంటి విద్యాసంస్థల్లో ఆర్ఎస్ఎస్ తన మనుషులను వైస్ చాన్సలర్లుగా, ప్రొఫెసర్లుగా ప్రవేశపెడుతోందని ఆరోపించారు.  దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలన్నింటినీ ఇప్పుడు ఒక సంస్థ (ఆర్ఎస్ఎస్) తన గుప్పిట్లోకి తీసుకుందని విమర్శించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ కలిసికట్టుగా దేశంలోని కీలక సంస్థలన్నింటినీ నాశనం చేస్తున్నాయని ఖర్గే మండిపడ్డారు.  ఖర్గే వ్యాఖ్యల పట్ల ఎన్డీయే సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ కడ్ కూడా ఖర్గే వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, ఖర్గే వెనుకంజ వేయకుండా ఆ తర్వాత కూడా తన విమర్శల దాడిని కొనసాగిస్తూ.. ఆర్ఎస్ఎస్ భావజాలం దేశానికి ప్రమాదకరమని తెలిపారు.

Spread the love