– రాజ్యాంగం, సామాన్య ప్రజలతో పెట్టుకుంటే కచ్చితంగా జైలుకే
– హీరో అల్లు అర్జునే కాదు ఎంతటి వారైనా తప్పుంటే వదిలేది లేదు
– ఆయన అరెస్ట్పై ప్రశ్నిస్తున్న గొంతులు..మహిళ మృతిపై ఎందుకు స్పందించట్లేదు?
– రియల్ ఎస్టేట్ వ్యాపారిలాగే ఫిల్మ్ స్టార్కు సినిమా ఒక బిజినెస్
– బీఆర్ఎస్ ది రాజుల తల్లి…మా తెలంగాణ తల్లి రైతుల తల్లి
– బీజేపీ అసలు ఎజెండాను ప్రజల ముందు పెట్టాలి :
– ఎజెండా ఆజ్ తక్ -2024 స్పెషల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ- న్యూఢిల్లీ బ్యూరో
అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ప్రకారం దేశ ప్రధానికైనా, సామాన్యుడికైనా ఒకే చట్టం వర్తిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తనతో పెట్టుకుంటే వదిలేస్తానని… కానీ రాజ్యాంగం, సామాన్య ప్రజలతో పెట్టుకుంటే కచ్చితంగా జైలుకు పంపిస్తానని హెచ్చరించారు. క్రైం చేసింది ఎవరన్నదే తమకు ముఖ్యమని, వారు సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అన్నది తమకు అవసరం లేదన్నారు. స్టార్లకు తాను ఇచ్చేది, వారి నుంచి తీసుకునేది ఏమీలేదని క్లారిటీ ఇచ్చారు. ఏడాది పాలనలో తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి తెచ్చామని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ‘ఎజెండా ఆజ్ తక్ -2024’ స్పెషల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్, యాంకర్ రాహుల్ కన్వల్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. హీరో అల్లు అర్జున్ అరెస్ట్కు గల కారణాలను వివరించారు. ‘పుష్ప-2 రిలీజ్ రోజు బెనిఫిట్ షోకు తమ ప్రభుత్వం అనుమతించింది. ఈ షోకు రూ. 300 టికెట్ను రూ.1,300కు కేటా యించారు. ఈ షో ప్రదర్శించిన థియేటర్ వద్ద ఎలాంటి ఏర్పాట్లు లేకుండానే హీరో అల్లు అర్జున్ వెళ్లారు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. ఆమె కొడుకు 13 రోజులుగా మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ వ్యవహారంలో క్రిమినల్ కేసులు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు థియేటర్ యాజమాన్యంతో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. అయితే 10 రోజుల తర్వాత అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు వెళ్లారు. హీరో కూడా పోలీసులతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. తర్వాత ఆయనను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అనంతరం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.’ అని వివరించారు. ఇదంతా పక్కన బెడితే… ఈ ఘటనలో ఒక ప్రాణం పోయిన విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. ఒక మహిళ మరణించిన తర్వాత కూడా కేసులు పెట్టకపోతే, ప్రజలు ఎలా స్వాగతిస్తారని ప్రశ్నించారు. తమ పాలనలో ‘సినిమా హీరోకు ఒక రాజ్యాంగం, సామాన్యుడికి మరో రాజ్యాంగం’ అనే చర్చ మొదలవుతోందని చెప్పారు. టాప్ హీరోలు సంజరు దత్, సల్మాన్ ఖాన్లు ఎందుకు జైలుకు పోయారో దేశ ప్రజలకు తెలుసన్నారు.
హీరో హంగామాతోనే మహిళ మృతి ఘటన
హీరో అల్లు అర్జున్ ఒక సామాన్యుడిలా కార్లో వెళ్లి సినిమా చూసి వెళ్లిపోతే అసలు సమస్యే ఉండేది కాదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. హీరో అలా కాకుండా కారు ఎక్కి అరుస్తూ, ఫ్యాన్స్లో హంగామా సృష్టించారని తెలిపారు. దీంతో పరిస్థితులు అదుపు తప్పి, తొక్కిసలాట జరిగిందన్నారు. అయినప్పటికీ ఈ కేసులో అల్లు అర్జున్ను ఏ11గా గుర్తించినట్టు చెప్పారు. మృతి చెందిన మహిళ మరణానికి కారణం ఎవరని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి ఎవరు సమాధానం ఇస్తారని, తొమ్మిందేండ్ల బాబు చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడని వివరించారు. ఇందులో ప్రభుత్వం, పోలీసుల బాధ్యత ఏదో మీరే చెప్పాలన్నారు. ‘సొంతంగా అది అల్లు అర్జున్ చిత్రం. ఆయన కావాలంటే స్టూడియోలో స్పెషల్ షో కూడా చూడచ్చు. ఇంట్లో హౌం థియేటర్లో కూడా చూడచ్చు.’ అని అన్నారు. అలా కాకుండా ప్రజల్లోకి వెళ్లి చూడాలంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, లేదా అక్కడ ఏర్పాటు చేసిన యాజమాన్యానికి సహకరించాలని చెప్పారు. ఎవరి సమాచారం లేకుండా సీఎంగా తాను కూడా ఏదైనా కార్యక్రమానికి హాజరైతే… తనపై కూడా కేసు నమోదు చేసే ఆస్కారం ఉంటుందన్నారు.
చుట్టమైనా పక్షపాతం చూపలే
ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ సీఎంగా తన పేరు మరిచిపోయినందుకు అరెస్ట్ చేశారనే వార్తల్లో నిజం లేదని చెప్పారు. అల్లు అర్జున్ చిన్నప్పటి (బఛ్ పన్) నుంచి తనకు తెలుసని సీఎం అన్నారు. అలాగే తాను అర్జున్కు పరిచయమేనని గుర్తు చేశారు. మెగాస్టార్ చిరంజీవికి అల్లు అర్జున్ మేనల్లుడని, ఆ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ నేత అని గుర్తు చేశారు. అలాగే అల్లు అర్జున్ మామ చంద్ర శేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ మనిషేనని అన్నారు. అంతేకాకుండా చంద్రశేఖర్ రెడ్డి తరపున అల్లు అర్జున్ తనకు చుట్టం వరుస అవుతారని వివరించారు. చుట్టరికం ఉన్నా, సీఎం బంధువైనా… ఈ వ్యవహారంలో పోలీసులు చట్టాన్ని ఫాలో అయ్యారని స్పష్టత ఇచ్చారు. సీఎంగా, హౌం మంత్రిగా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య వచ్చినప్పుడు నివేదికను పోలీస్ శాఖ నుంచి కోరడంలో తప్పేముందని ప్రశ్నించారు. చట్ట ప్రకారం ఎవరైనా ఆందోళన చేయొచ్చని, అనుమతి లేకుండా ఆందోళనకు దిగితే జైలు వెళ్లాల్సిందే అని ఆయన హెచ్చరించారు.
ఒక మహిళ మరణం మీకు పట్టదా….?
‘ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినందుకు ఇంతలా ప్రశ్నిస్తోన్న మీరు ఒక మహిళ ప్రాణం పోయిందని కనీసం ఒక్క ప్రశ్న అడగడం లేదని సీఎం రేవంత్రెడ్డి కాస్తంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరణించిన మహిళ కుటుంబ ఆర్థిక పరిస్థితి, 11 రోజులుగా కోమాలో ఉండి, చావు బతుకుల మధ్య ఉన్న ఆమె కొడుకు గురించి కనీసం ఆలోచించడం లేదని అన్నారు. ‘ఫిల్మ్ స్టార్కు సినిమా ఒక బిజినెస్ అని, డబ్బులు పెట్టి డబ్బులు సంపాదించుకుంటారని చెప్పారు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేసి అమ్ముకొని డబ్బులు సంపాదిస్తారన్నారు. అంతేకానీ పాకిస్థాన్ బార్డర్కు వెళ్లి… దేశం కోసం గెలిచి వచ్చారా?’ అని ప్రశ్నించారు. దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న గెస్ట్లు సీఎం స్పీచ్కు మద్దతు తెలుపుతూ చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ బాధ్యత నాదే
హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి గురించి ఆ రాష్ట్ర నేతల్ని అడగాలని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఆ రాష్ట్రాల్లో ఎన్నికలను తాను దూరం నుంచి వీక్షించినట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి తాను బాధ్యత వహిస్తానని(తెలంగాణ కో మే జిమ్మేదారి), దేశానికి నేనెలా బాధ్యత తీసుకోగలను(మే కైసే దేశ్ కా జిమ్మెదారి లేలూ) అని క్లారిటీ ఇచ్చారు. మహారాష్ట్ర, హర్యానా గురించి తాను స్టడీ చేయలేదని, మరోసారి ఇలాంటి ప్రొగ్రాంకు పిలిస్తే స్టడీ చేసి వస్తానంటూ నవ్వులు కురిపించారు. తాజా ఎన్నికల్లో ఓటమిపై పార్టీ అగ్రనేత రాహుల్తో పోస్ట్మార్టం చేస్తే బాగుంటుంది కానీ… ఆజ్ తక్ సీనియర్ జర్నలిస్ట్ రాహుల్ కన్వల్తో పోస్ట్మార్టం చేస్తే ఏం బాగుంటుందని వ్యంగ్యస్త్రాలు సంధించారు.
బీజేపీ అసలు ఎజెండాను ప్రజల ముందు పెట్టాలి
దేశం, రైతులు, వివిధ వర్గాల అభివృద్ధి కోసం పాటుపడని బీజేపీ అసలు ఎజెండాను ప్రజల ముందు పెట్టాలని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. బీజేపీ చెప్పేది ఒకటైతే, చేసేది మరొకటని విమర్శించారు. ఈ తేడాను ప్రజలకు అర్థమయ్యేలా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచిస్తానన్నారు. అదే తెలంగాణ, కర్నాటకలో పార్టీ గెలుపునకు సహకరించిందని పరోక్షంగా వివరించారు. తనకన్నా ముందు తాను కూర్చున్న సీట్లో గెస్ట్గా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ కుర్చున్నారని చెప్పారు. ఆయన మూడు సార్లు మధ్యప్రదేశ్ సీఎంగా ఉన్నారని గుర్తు చేశారు. అయితే… మోడీ సర్కార్ తెచ్చిన మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు 16 నెలలు రైతులు ఆందోళన చేశారని గుర్తు చేశారు. ఈ రైతు ఉద్యమంలో 750 మంది ప్రాణాలు అర్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మరిణించిన బాధిత కుటుంబాలను కలిసేందుకు కూడా మోడీ ఒక్క సారి ప్రయత్నం చేయలేదన్నారు. ఇవేమి చేయకుండా తెచ్చిన నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించి, క్షమాపణల పేరుతో ఓట్లు అడుక్కున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రి కొడుకు యూపీలో రైతులపై వాహనం ఎక్కించి హత్య చేసిన విషయం అందరికీ తెలుసునన్నారు. ప్రస్తుతం ఆ కేసు ఎక్కడుందని ప్రశ్నించారు. ఈ అసలైన బీజేపీ రంగు, ముఖాన్ని ప్రజలకు తెలియజేస్తేచాలని ప్రజలే ఆ పార్టీని ఓడిస్తారని, కాంగ్రెస్ ఓడించాల్సిన అవసరం లేదని అన్నారు.
మోడీ గ్యారెంటీ ఏమైంది ?
స్విస్ బ్యాంక్లోని నల్లధనం తెచ్చి ప్రతి పేద వాడి అకౌంట్లో రూ. 15 లక్షలు వేస్తానన్నా ప్రధాని మోడీ గ్యారెంటీ ఏమైందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చి 11 ఏండ్లైనా ఆ హామీని మోడీ, బీజేపీ సర్కార్ ఎందుకు నిలబెట్టుకోలేదని నిలదీశారు. కానీ ఏడాది కాలంలో ఎంతో సమర్థవంతంగా పాలిస్తోన్న తమ సర్కార్ను ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారని చురకలంటించారు. 2022 వరకు దేశంలోని పేదలందరికీ పక్కా ఇండ్లు ఇస్తామని బీజేపీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మరి ఎంత మంది పేదలకు ఇచ్చిందో వెల్లడించాలన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
ఏ రాష్ట్రంలో రుణమాఫీ చేశారో చెప్పాలి
తాము అధికారంలోకి వచ్చిన తొలి పది నెలల్లో 25,35,000 మంది రైతులకు రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేసినట్టు సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి నిర్ణయం తీసుకుంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర దేశంలో ఇంత పెద్ద మొత్తంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా రైతు రుణమాఫీ చేయలేదని గుర్తు చేశారు. కనీస మద్దతు ధరతో పాటు పంటకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఏడాది కాలంలో తమ సర్కార్ 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పారు. రాష్ట్రంలోని మహిళకు ఉచిత బస్సు ప్రయాణాలకు గానూ ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.4 వేల కోట్లు చెల్లించిందన్నారు. మహిళలకు ఫ్రీ రైడ్తో మెట్రోకు నష్టం వాటిల్లుతుందన్న విమర్శలను సీఎం ఖండించారు. హైదరాబాద్ సిటీలో కేవలం సెలెక్టెడ్ రూట్లలో 69 కిలో మీటర్లు మెట్రో మార్గం ఉందన్నారు. కానీ మహిళలకు ఫ్రీ బస్సు రైడ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చామని, ఇందులో ఎంతమంది మెట్రోలో వెళ్లకుండా ఆర్టీసీలో ఉచిత ప్రయాణాలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో మెట్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ ఓ) పొలిటికల్ మోటివేటెడ్ స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. ఇతర పార్టీలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా వ్యవహరించారని, అందుకే ఆయనను అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. దీంతో ఆయన ముంబై పారిపోయాడని చెప్పారు.
వైబ్రెంట్ గుజరాత్ వర్సెస్ రైజింగ్ తెలంగాణ
వైబ్రాంట్ గుజరాత్ కు పోటీగా రైజింగ్ తెలంగాణ పేరుతో కౌంటర్ ప్రాడెక్ట్ ను షురూ చేశామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. వచ్చే ఏడాది కాలంలో వైబ్రాంట్ గుజరాత్ను వెనక్కి నెట్టి… రైజింగ్ తెలంగాణను ముందుకు తీసుకెళ్తామన్నారు. బాస్ రాహుల్ గాంధీ, తన లైన్ ఒక్కటే అన్నారు. అర్థం చేసుకోవడంలో పొరపడుతున్నట్లు చెప్పారు. అదానీ, బిర్లా.. ఎవరైనా పోరాడే గ్రౌండ్ ఒక్కటే ఉండాలని… అందరికీ సమాన అవకాశాలు ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు. ముంబయి ఎయిర్ పోర్ట్ను తెలుగు ప్రాంతానికి చెందిన జీవికె కంపెనీ నిర్మించిందన్నారు. కానీ, ఈడీ, ఇన్ కం ట్యాక్స్, సీబీఐ జీవికె పై రైడ్స్ చేసి కేసులు పెట్టాయని… ముంబై ఎయిర్ పోర్ట్ను అదానీకి అప్పగించగానే ఆ కేసులు మాఫీి అయ్యాయని ఆరోపించారు. నిజంగా అమెరికా ఆరోపణల్లో నిజం లేకపోతే అదానీ ముడుపుల వ్యవహారంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) వేయడంలో ప్రధాని మోడీకి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు.
మాది రైతుల తల్లి…
బీఆర్ఎస్ హయాంలో పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం రాజుల తల్లిగా ఉందని సీఎం విమర్శించారు. ఇటీవల తమ సర్కార్ ఆవిష్కరించిన విగ్రహం రైతుల తల్లిగా ఉందని అభివర్ణించారు. తాము రైతుల బిడ్డలమని, అందుకే రైతుతల్లి కన్న బిడ్డగా… అమ్మను రూపొందించుకున్నామని చెప్పారు. అందుకే విగ్రహాన్ని మార్చినట్టు క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహంలోని చేయి… కాంగ్రెస్ పార్టీ సింబల్ ‘హస్తం’ గుర్తును పోలి ఉందన్న విమర్శలను కొట్టి పారేశారు. బీజేపీ చెప్పుకునే భారత మాతా చిత్రం, గౌతమ బుద్ధుడు, షిర్డీ సాయిబాబా విగ్రహాల్లోనూ ఇదే రీతిలో హస్తం ఉంటుందన్నారు.
తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామ్యం అందించాం
తమ ఏడాది పాలనలో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని అందించామని సీఎం అన్నారు. ఇదే బీఆర్ఎస్కు తమ ప్రభుత్వానికి ఉన్న తేడా అన్నారు. కేసీఆర్ హయాంలో ప్రజా భవన్ను గడిగా మల్చుకొని పాలిస్తే… తాను సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే ఆ గడీ గేట్లను బద్దలు కొట్టామన్నారు. ఏ కష్టం ఉన్నా ప్రజలు తమ దరఖాస్తును నేరుగా తన ఇంటికి వచ్చి అందించవచ్చన్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో కనీసం 10 రోజులు కూడా సెక్రెటేరియట్కు వెళ్లలేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఇన్ స్టాల్మెంట్ రూపంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వచ్చేవని… తమ ప్రభుత్వం ఒకటవ తేదీన జీతాలు ఇస్తుందన్నారు. ఇదే కాంగ్రెస్ సర్కార్ ఫస్ట్ గెలుపని చెప్పారు. దేశంలోనే ఈ ఏడాది తెలంగాణ లో అత్యధికంగా కోటి. 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి చేశామన్నారు. రైతులకు అందిస్తోన్న బోనసే ఈ విజయానికి కారణమన్నారు. అలాగే రాష్ట్రంలో మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రక్షాళన, 360 కి.మీ రీజినల్ రింగ్ రోడ్డు, వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు.
ఆర్ఆర్ ట్యాక్స్ పై ఒక్క ఆధారమైనా చూపండి : ప్రధాని మోడీకి సవాల్
రాహుల్, రేవంత్ ట్యాక్స్ (ఆర్ఆర్ ట్యాక్స్) పేరుతో ఆరోపణలు చేస్తోన్న ప్రధాని మోడీ ఇందుకు సంబంధించి ఒక్క ఎవిడెన్స్ ఉన్నా చూపాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బీజేపీ నేతగా ఆయన ఇలాంటి ఆరోపణలు చేస్తే బాగుండేది కానీ, దేశానికి ప్రధానిగా ఉండి ఈ కామెంట్స్ చేయడం సరికాదని చురకలంటించారు. ఎన్నికల టైంలో ఇలాంటి కామెంట్స్తో ప్రజల్ని మభ్య పెట్టవద్దన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్… తనను హత్య చేసేందుకు పాకిస్తాన్, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు సుపారీ ఇచ్చారని వ్యాఖ్యానించడం మోడీ విజ్ఞతకే వదిలేస్తున్నట్టు తెలిపారు. ఇలాంటివి నిజమే అయితే దర్యాప్తు చేయాలి కానీ, నిందలు వేయడం కాదన్నారు.న