– ఎన్పీఆర్డీ సంస్మరణ సభ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సాయిబాబా పోరాటాలు కొనసాగుతాయని, అదే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి అని వక్తలు పేర్కొన్నారు. మానవ హక్కుల కోసం మాట్లాడిన ప్రొఫెసర్ సాయిబాబాను మోడీ ప్రభుత్వం పదేండ్లపాటు జైల్లో పెట్టి చిత్రహింసలకు గురి చేసిందన్నారు. ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా సంస్మరణ సభ సోమవారం హరికిషన్ సింగ్ సూర్జిత్ భవన్లో ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా మానవ హక్కుల కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు, సాయిబాబా సహచరులు ఆయనను స్మరించుకున్నారు. ఆయన చేపట్టిన పోరాటాలు కొనసాగుతాయని తెలిపారు. ఎన్పీఆర్డీ ప్రధాన కార్యదర్శి మురళీధరన్ మాట్లాడుతూ దేశంలో లెక్కలేనన్ని విభిన్న సంస్థలున్నప్పటికీ సాయిబాబాకు అండగా నిలిచేది ఎన్పీఆర్డీ ఒక్కటేనని గుర్తు చేశారు. సాయిబాబాతో భావోద్వేగ, వ్యక్తిగత సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సాయిబాబా లాంటి అనేక మందిని కేంద్రం ఇప్పటికీ తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టిందని అన్నారు. 90 శాతం వికలాంగుడైన సాయిబాబా మనస్సును జైలు నిర్వీర్యం చేయకపోయినా, ఆయన శరీరం తట్టుకోలేకపోయిందని సామాజిక కార్యకర్త హర్ష్ మందార్ వీడియో సందేశంలో తెలిపారు. సాయిబాబా వికలాంగుల ప్రజాసేవకుడని ప్రొఫెసర్ అమిత దండా గుర్తు చేసుకున్నారు. వికలాంగులను ఒంటరిగా కారాగారంలో బంధించడం దారుణమని, సాయిబాబా ఆలోచనగా కొనసాగుతుందని తెలిపారు. ఆయన సహచరురాలు, ఢిల్లీ యూనివర్శిటీ టీచర్స్ యూనియన్ (డీయూటీయూ) మాజీ అధ్యక్షుడు ప్రొఫెసర్ నందితా నారాయణ్ మాట్లాడుతూ ఆయన నివాసంపై దాడి చేసి అరెస్టు చేయడం చట్టబద్ధమైనది కాదని, ఇది రాజ్యం చేసిన హత్య అని అన్నారు. సాయిబాబాతో పాటు ఏ ఒక్క వికలాంగుల సమస్యలను యూనివర్శిటీ, అడ్మినిస్ట్రేషన్లు వినడం లేదని ప్రొఫెసర్ వికాస్ గుప్తా అన్నారు. యూనివర్శిటీ ఆయనకు ర్యాంప్ కూడా లేని ఇల్లు ఇచ్చిందని, సాయిబాబా కేసులో కోర్టులు కూడా అసాధారణ వైఫల్యం చెందాయని తెలిపారు. మానవ అంతరిక్ష కార్యకర్త జాన్దయాల్ కూడా సాయిబాబా లేవనెత్తిన ఆలోచనలు ఔచిత్యాన్ని పొందుతున్నాయని గుర్తు చేశారు. సభకు సీమా కాకర్ల అధ్యక్షత వహించారు. అలాగే సాయిబాబా రచించిన పద్యాన్ని ఆలపించారు.