దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసిన బండి సంజయ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Bandi Sanjay and Government Whip Adi Srinivas distributed tools to the disabled– కబ్జాకోరులపై ఉక్కుపాదం మోపండి… మీ వెంట మేముంటాం
– జిల్లాకు నవోదయ స్కూల్ మంజూరు కాబోతోంది
– వేములవాడను ప్రసాద్ స్కీం కింద చేర్చబోతున్నాం
– గతంలో నన్ను ఏ కార్యక్రమాలకు పిలవలేదు
– ఎప్పుడైనా పిలిస్తే..ఆ అధికారిపై బదిలీ వేటు వేసే వాళ్లు
– ఇప్పుడైనా ప్రజల కోసం కలిసి పనిచేద్దాం… అభివ్రుద్ధి సాధిద్దాం
– కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
నవతెలంగాణ – సిరిసిల్ల
‘రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్ ను మళ్లీ కోరుతున్నా… పేదల భూములను కబ్జాలు చేసినోళ్లను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించనోళ్లపై ఉక్కుపాదం మోపండి. మీ వెంట నాతోసహా వేల మంది అండగా ఉంటారు. ఈ విషయంలో మీరు ముందుకు పోవాలని కోరుతున్నా’’ …రాష్ట్రంలో ప్రభుత్వ భవనాలు నిర్మించాలంటే, మంచి పనులు చేయాలంటే ప్రభుత్వ స్థలాలు లేకుండా పోయాయని, గత బీఆర్ఎస్ పాలకులు, కేసీఆర్ కుటుంబం ధరణి పేరుతో ప్రభుత్వ భూములన్నీ ప్రైవేట్ చేశారని మండిపడ్డారు. అట్లాంటి వారిని ఉపేక్షించొద్దని, బుల్డోజర్లు దించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన దివ్యాంగులకు ఉప కరణాల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ  కార్యక్రమంలో బండి సంజయ్ తోపాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నాగుల సత్యనారాయణ, స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేల్మూల స్వరూప తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈరోజు సమాజంలో అన్ని అవయవాలు ఉన్న మనమే అనేక సమస్యలకు సతమతమవుతున్నాం. అలా చూస్తే దివ్యాంగుల ఇబ్బందులు వర్ణణాతీతం. కానీ దివ్యాంగుల మనో నిబ్బరం, ధైర్యం గ్రేట్…మీకు మేం చేయాల్సిందల్లా అండగా ఉండటమేనని ఆయన అన్నారు.కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ వయోశ్రీ యోజన పథకాల కింద ఈరోజు 69 లక్షల 54 వేల 911 రూపాయల విలువైన 675 పరికరాలను  322 మంది దివ్యాంగులకు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కేవలం నాలుగేళ్లలోనే నా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో దివ్యాంగులు, మహిళలు, వ్రుద్దుల సంక్షేమం కోసం 100 కోట్లకుపైగా నిధులు ఖర్చు చేసినం. దివ్యాంగుల, వ్రుద్దుల ఆశ్రమాలకు కేంద్రం పెద్ద ఎత్తున నిదులు మంజూరు చేస్తోంది. రాబోయే రోజుల్లో రాజకీయాలకు అతీతంగా కలిసి ముందుకు పోవాలని భావిస్తున్నా.
దారి తప్పుతున్నోళ్లను దారికి తెచ్చేందుకు యత్నిస్తా. నేను 5 ఏళ్లలో ఎన్నడూ కలెక్టరేట్ కు రాలేదు. ఏ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఎందుకంటే గతంలో నన్ను ఏ కార్యక్రమానికి పిలవలేదు. కలెక్టరేట్ కు వెళితే.. వెంటనే బాధ్యులను బదిలీ చేసే వాళ్లు. కలెక్టర్ … ఎమ్మెల్యేలారా… బీఆర్ఎస్ ప్రభుత్వం కబ్జా చేసిన స్థలాలు, భవనాలన్నీ స్వాధీన పర్చుకోండి. గతంలో ఎకరాలకు ఎకరాలు కబ్జాలు చేసి దోచుకుంటామంటూ చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేమని ఆయన అన్నారు.నేను మళ్లీ కోరుతున్నా… పేదల భూములను కబ్జాలు చేసిటోళ్లను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించనోళ్లపై ఉక్కుపాదం మోపండి. మీ వెంట వేల మంది అండగా ఉంటారు. ఎందుకంటే  మంచి పనులు చేయాలంటే ప్రభుత్వ స్థలాలు లేకుండా చేశారు. ధరణి పేరుతో భూములన్నీ దోచుకున్నరు. ఒక కుటుంబమే ఎక్కువగా లాభపడ్డది. ప్రభుత్వ భూములన్నీ ప్రైవేట్ పరం చేశారు. ఇకపై అట్లా జరగడానికి వీల్లేదు. సిరిసిల్ల జిల్లాలో నవోదయ స్కూల్ త్వరలో మంజూరు కాబోతోంది. ఆ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపినం. గతంలో ప్రసాద్ స్కీం కింద నిధులిస్తాం ప్రతిపాదనలు పంపాలని కోరితే నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం మేం ప్రతిపాదనలు పంపిన వెంటనే పంపారు. అతి త్వరలోనే వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రసాద్ స్కీంలో చేర్చుతాం.నేను ఎంపీగా, కేంద్ర మంత్రిగా గెలిచానంటే మీరు పెట్టిన భిక్షే. మీరు గెలిపిస్తేనే ఈ స్థాయికి వచ్చిన. కలిసి పనిచేస్తా. కేంద్రం నుండి అవసరమైన నిధులన్నీ తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివ్రుద్ధి చేసేందుకు యత్నిస్తా. నా లక్ష్యం ఒక్కటే. నా పార్లమెంట్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్క దివ్యాంగుడికి పరికరాలివ్వాలి. వాళ్లను అన్ని విధాలా ఆదుకోవాలి. మనసులో వారికి ఏ బెంగ లేకుండా రోజువారీ జీవితం గడిచేలా చేయాలన్నదే నా సంకల్పం. అందుకే నా పార్లమెంట్ పరిధిలో పరికరాలు అందకుండా ఇంకా ఎవరైనా దివ్యాంగులు మిగిలి ఉంటే వాళ్ల జాబితా కూడా సిద్ధం చేయండి. వాళ్లందరికీ పరికరాలు అందించే ఏర్పాట్లు చేద్దాం. ఈ జిల్లాలో ఇకపై ఏ ఒక్క దివ్యాంగుడి నోటి నుండి నాకు పరికరం అందలేదనే మాట రావద్దని ఆయన అన్నారు.
Spread the love