నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న రూ.7500 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ డిమాండ్ చేశారు. సోమవారం బకాయిలను విడుదల చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి కి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని పేర్కొన్నారు.గత మూడు సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లు, మేస్ ఛార్జీలు విడుదల కాకపోవడం వలన విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని ఆవేదన చెందారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, బహుజన విద్యార్థుల అభివృద్ధికై తోడ్పడాలని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాకపోవడం వలన ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్ లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా వెంటనే రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లు, మెస్ ఛార్జిలు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న, ఉపాధ్యక్షులు కాసర్ల లింగస్వామి, రాష్ట్ర కోఆర్డినేటర్ బాకీ తరుణ్, నియోజకవర్గ అధ్యక్షులు పగడాల శివతేజ, సింగపంగా వరుణ్, తదితరులు పాల్గొన్నారు.