పోలవరాన్ని చూస్తే కండ్ల నుంచి నీళ్లొచ్చాయి

పోలవరాన్ని చూస్తే కండ్ల నుంచి నీళ్లొచ్చాయి– ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి: పోలవరాన్ని జగన్‌ గోదావరిలో ముంచారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే జగన్‌ చేసిన నష్టమే ఎక్కువన్నారు. పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శుక్రవారం శ్వేతపత్రం విడుదల చేశారు. గత ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించిన పురోగతిని రాష్ట్ర ప్రజల ముందుంచిన ఆయన.. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పరిస్థితి చూసి తన కళ్ల వెంట నీళ్లొచ్చాయన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..” పోలవరం గురించి వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలిపేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నాం. ఏడు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. మేధావులు, నిపుణులు సహా అందరి సలహాలూ తీసుకుంటాం. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలి. కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువగా నిధులు తెచ్చుకోవాలి. 25 రోజుల్లో బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. వెబ్‌సైట్ల ద్వారా పత్రాలన్నీ అందుబాటులో ఉంచుతాం” అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై గత సీఎం జగన్‌ అసెంబ్లీ వేదికగా ఏటా చేసిన ప్రసంగాలతో పాటు ఏపీ మంత్రిగా అంబటి రాంబాబు చేసిన ప్రకటన వీడియోలను మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రదర్శించారు.
పోలవరానికి జగన్‌ ఓ శాపం..: చంద్రబాబు
”పోలవరంపై మొదటి శ్వేతపత్రం విడుదల చేస్తున్నాం. సాగునీటి ప్రాజెక్టులపై రెండో శ్వేతపత్రం ఇస్తాం. రాష్ట్ర అభివద్ధికి జీవనాడి పోలవరం. నదుల అనుసంధానానికి గుండెలాంటిది. ఇలాంటి పోలవరానికి జగన్‌ ఒక శాపంలా మారారు. ఈ ప్రాజెక్టు విషయంలో క్షమించరాని నేరం చేశారు. రాష్ట్రానికి అమరావతి, పోలవరం రెండూ ప్రధాన ప్రాజెక్టులు. ఈ రెండూ రాష్ట్రానికి రెండు కండ్లు లాంటివి. ఈ రెండూ పూర్తి చేసుకుంటే విభజనలో జరిగిన అన్యాయాన్ని, నష్టాన్ని పూడ్చుకొనే అవకాశం ఉంటుంది. రాష్ట్రాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. పోలవరం ధ్వంసం జాతికి జరిగిన విద్రోహం. రాష్ట్ర అభివద్ధికి జలవిద్యుత్‌ కీలకం. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే వ్యవసాయ రంగానికి ఊతం వస్తుంది. విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్‌ చేసిన నష్టమే అధికం. 2014-19 మధ్య పోలవరానికి రూ.11,762 కోట్లు ఖర్చు చేశాం. వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.4,167 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. జగన్‌ మూర్ఖత్వం వల్లే డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింది. జగన్‌ ప్రమాణం చేస్తూనే పోలవరం పనులు ఆపేశారు” అన్నారు.
ఆ హెచ్చరికలనూ పెడచెవినపెట్టారు..
ప్రత్యామ్నాయం లేకుండా కాంట్రాక్టర్లను తొలగించారు. సమర్థులైన అధికారులను బదిలీ చేశారు. డయాఫ్రమ్‌వాల్‌ దెబ్బతిందని హైదరాబాద్‌ ఐఐటీ బృందం చెప్పింది. ఆ విషయం జగన్‌కు రెండేళ్ల తర్వాత తెలిసింది. కాంట్రాక్టర్లను మార్చొద్దని పీపీఏ హెచ్చరించింది. 2009లోనూ వైఎస్‌ కాంట్రాక్టర్‌ను మార్చారు. వైఎస్‌ కాంట్రాక్టర్‌ను మార్చడం వల్ల హెడ్‌ వర్క్స్‌ నిలిచిపోయాయి. ఆయన చేసిన తప్పే జగన్‌ కూడా చేశారు. పీపీఏ హెచ్చరికలను జగన్‌ పెడచెవిన పెట్టారు. 2019 ఆగస్టు 16న సీఎస్‌కు పీపీఏ లేఖ రాసింది. ఏజెన్సీలను మార్చొద్దని స్పష్టంగా చెప్పింది.అని అన్నారు.

Spread the love