బిహార్‌లో ‘నీట్‌’ పేపర్‌ లీక్‌..రూ.30 లక్షలు: దర్యాప్తులో సంచలనాలు

నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్‌- యూజీ ప్రవేశ పరీక్ష 2024లో అక్రమాలు జరిగినట్లు వస్తోన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బిహార్‌లో ఈ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు సమాచారం రాగా.. కేంద్రం, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ దీన్ని తోసిపుచ్చింది. అయితే, తాజాగా బిహార్‌ ఆర్థిక నేరాల విభాగం చేపట్టిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నీట్‌ పేపర్‌ లీక్‌ చేసినందుకు కొందరు అభ్యర్థులు రూ.30 లక్షల చొప్పున చెల్లించినట్లు బయటపడిందట. ఈమేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై దర్యాప్తునకు బిహార్‌ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసింది. ఇందులోభాగంగానే ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేశారు. వీరిలో బిహార్‌ ప్రభుత్వ విభాగంలో పనిచేసే ఓ జూనియర్‌ ఇంజినీర్‌ కూడా ఉన్నాడు. పేపర్‌ లీక్‌ గ్యాంగ్‌తో కలిసి తాను అక్రమాలకు పాల్పడినట్లు ఆ జూనియర్‌ ఇంజినీర్‌ విచారణలో అంగీకరించినట్లు సమాచారం. కొందరు నీట్ అభ్యర్థుల కుటుంబసభ్యులతోనూ తాను టచ్‌లో ఉన్నట్లు చెప్పాడట.

Spread the love