– రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. సీఎం వెంట ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, సురేశ్ షెట్కార్, కావ్య, ఎం.అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. కాజీపేటలో పీరియాడికల్ ఓవర్హాలింగ్ (పీవోహెచ్) వర్క్షాప్ ఏర్పాటు చేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించిందని సీఎం తెలిపారు. ఆ తర్వాత సైతం కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోరుతూ తాను లేఖ రాశానని సీఎం వివరించారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అనేది కాజీపేట వాసుల కల మాత్రమే కాదని.. యావత్ తెలంగాణ స్వప్నమని చెప్పారు. అలాగే వికారాబాద్-కృష్ణా స్టేషన్ మధ్య పూర్తిగా రైల్వే శాఖ వ్యయంతో నూతన రైలు మార్గం నిర్మించాలని రైల్వే మంత్రిని కోరారు. ఈ మార్గం నిర్మిస్తే దక్షిణ తెలంగాణలో మారుమూలన వెనుకబడి ఉన్న పరిగి, కొడంగల్, చిట్లపల్లె, టేకల్ కోడ్, రావులపల్లి, మాటూరు, దౌల్తాబాద్, దామరగిద్ద, నారాయణపేట్, మక్తల్ అభివృద్ధి చెందడంతో పాటు తాండూర్ సమీపంలోని సిమెంట్ క్లస్టర్, ఇతర పరిశ్రమల అభివృద్ధికి అవకాశం ఉంటుందన్నారు. ఈ మార్గంతో వికారాబాద్ జంక్షన్ నుంచి కృష్ణా స్టేషన్ల మధ్య 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని వివరించారు. కల్వకుర్తి-మాచర్ల మధ్య నూతన రైలు మార్గం మంజూరు చేయాలని రైల్వే శాఖ మంత్రిని సీఎం కోరారు. కల్వకుర్తి నుంచి వంగూరు-కందుకూరు-దేవరకొండ-చలకుర్తి-తిరుమ లగిరి మీదుగా మాచర్ల వరకు తాము ప్రతిపాదించే నూతన మార్గం ప్రతిపాదిత గద్వాల-డోర్నకల్, ఇప్పటికే ఉన్న మాచర్ల లైన్లను అనుసంధానిస్తుందని సీఎం వివరించారు. ఈ లైన్ నిర్మిస్తే సిమెంట్ పరిశ్రమలతో పాటు అటవీ ఉత్పత్తుల విక్రయానికి ప్రయోజనం కలుగు తుందని తెలిపారు. ఈ లైన్తో సికింద్రాబాద్, గుంటూరు, డోన్ సెక్షన్ల మధ్య అనుసంధానత కలిగి శ్రీశైలం వెళ్లే భక్తుల సుల భతర ప్రయాణానికి అవకాశం కల్పిస్తుందని వివరించారు. డోర్నకల్-మిర్యాలగూడ (పాపటపల్లి-జాన్ పహాడ్), డోర్నకల్-గద్వాల ప్రతిపాదిత రైలు మార్గాలను పున్ణపరిశీలిం చాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు సీఎం విజ్ఞప్తి చేశారు.
ఈ రెండు రైలు మార్గాలు పరిశీలించండి
ఖమ్మం జిల్లాలోని సారవంతమైన భూములు, చెరకు పరిశ్రమలు, గ్రానైట్ పరిశ్రమలు, సైబరియన్ వలస పక్షుల కేంద్రం, దేశంలోని అతి పెద్ద బౌద్ధ స్తూపం, పాలేరు రిక్రియేషన్ ప్రాంతాల మీదుగా ఉన్నాయని సీఎం తెలిపారు. పాలేరు శాసనసభ నియోజకవర్గంలోని ఈ ప్రాంతంలో భూముల ధరలు భారీగా ఉన్నాయని, అత్యధికులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన రైతులేనని సీఎం వివరించారు. ఇక్కడ విలువైన భూముల సేకరణ రైల్వే శాఖకు భారంగా మారుతుందని.. ఆ ప్రతిపాదిత రైల్వే లైన్ల మార్గాలను డోర్నకల్ నుంచి వెన్నారం-మన్నెగూడెం-అబ్బాయిపాలెం-మరిపెడ మీదుగా మోతె వరకు మార్చాలని సీఎం కోరారు. ఈ ప్రాంతాలు పూర్తిగా వెనుకబడి ఉన్నాయని.. రైలు మార్గాలు కూడా లేవని తెలిపారు. పైగా గతంలోని మార్గాలతో పోలిస్తే 19 కి.మీ. దూరం తగ్గుతుందని సీఎం వివరించారు. ఈ రెండు మార్గాల అలైన్మెంట్ను పున:పరిశీలించాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.