– 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన వర్గీకరణ
– ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎస్సీ వర్గీకరణ అమలుకు ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చెయ్యాలని మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం మంగళవారం హైదరాబాద్లోని సచివాలయంలో భేటీ అయింది. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇప్పటికే అధికారుల బృందం తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసిందన్నారు. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఉపకులాల వర్గీకరణ ఉంటుందని, అందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఉద్యోగ నియామకాలతో సహా నివేదికను రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. వర్గీకరణపై ప్రజాభిప్రాయ సేకరణకు గాను మంత్రివర్గ ఉప సంఘం జిల్లాల వారీగా పర్యటించనున్నట్టు వెల్లడించారు. కమిషన్ నియామకంలో అడ్వకేట్ జనరల్ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని ఉపసంఘం తీర్మానించింది. ఏక సభ్య కమిషన్ చట్టపరంగా పటిష్టంగా ఉండడంతో పాటు కమిషన్ సిఫారసులను అమలు చేస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఉంటుందని ఉపసంఘం ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సమావేశంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి, బీసీ కమిషన్ చైర్మెన్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.