విద్యార్థుల బ్యాగులు తనిఖీ చేయాల్సిందే: సందీప్ శాండిల్య

నవతెలంగాణ – హైదరాబాద్: ఇటీవల డ్రగ్స్ తీసుకున్న మహిళలో మార్పు కనిపించిందని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. కొన్ని నెలల కిందట డ్రగ్స్ తీసుకున్న మహిళకు పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని, తాజాగా నిర్వహించిన టెస్టుల్లో ఆమెకు నెగిటివ్ వచ్చిందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా స్కూల్స్, కాలేజీల్లో మత్తుపదార్థాల నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం అయిన నేపథ్యంలో యాజమాన్యాలకు టీజీ న్యాబ్ డైరెర్టర్ సందీప్ శాండిల్య పలు సూచనలు చేశారు.
యాజమాన్యాలకు కీలక సూచనలు: విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా డ్రగ్స్ నిర్మూలనకు యాజమాన్యాలు సహకరించాలని సందీప్ శాండిల్య కోరారు. పాఠశాలలు, కళాశాలల్లో బ్యాగులను 100శాతం తనిఖీ చేయాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. బ్యాగుల్లో ఈ -సిగరెట్స్, గంజాయి, లిక్కర్ బాటిళ్లు ఉంటున్నాయని, అందుకే తప్పని సరిగా రోజూ వారి బ్యాగులు తనిఖీ చేయాలన్నారు. విద్యాసంస్థల్లో కొంతమంది సీనియర్లు జూనియర్లను డ్రగ్స్ కోసం ఉపయోగించుకుంటున్నారని, దీనిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. యాంటి డ్రగ్ కమిటీలు పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. పాఠశాల యాజమాన్యాలు ఒక రిటైర్డ్ పోలీస్‌ను రిక్రూట్ చేసుకోవాలని ఆదేశించారు.

Spread the love