ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా చెప్పారు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా కౌన్సిలేట్ ఆధ్వర్యంలో తెలంగాణ పర్యటక శాఖ, కొరియన్ పర్యాటక శాఖల సమన్వయంతో రెండు రోజులపాటు హైదరాబాదులోని బంజారాహిల్స్ ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్లో ఏర్పాటు చేసిన కొరియన్ ఫిలిం ఫెస్టివల్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పండుగ వాతావరణంలో ఉచితంగా అన్ని వర్గాల వారు తిలకించేందుకు రెండు రోజులపాటు చిత్రాలను ప్రదర్శించనున్న్నట్టు తెలిపారు. కొరియా చాలా అందమైన దేశం, ఈ ప్రతిష్టాత్మక చలన చిత్రోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ ఎల్లప్పుడూ సంస్కృతుల సమ్మేళనం, ఈ కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్ను నిర్వహించడం సాంస్కృతిక మార్పిడికి నిదర్శనమని తెలిపారు. ఆయా దేశాల సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు తెలుసుకునేందుకు ఫిల్మ్ ఫెస్టివల్స్ దోహడపడతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి బాలయ్య, ప్రాంతీయ పాస్పోర్టు అధికారి, కాన్సుల్ జనరల్ – యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హిస్ ఎక్సలెన్సీ మిస్టర్ ఆరెఫ్ అలీ, యునైటెడ్ కింగ్డమ్ కమిషనర్ అల్తాబూర్ అల్నుయిమి, ప్రసాద్ గ్రూప్ అధినేత రమేష్ ప్రసాద్, హ్యుండారు మోటార్ యి గెన్ హాన్, హైదరాబాద్లోని కొరియన్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ చుక్కపల్లి తదితరులు పాల్గొన్నారు.