– ఆంధ్రప్రదేశ్కు రూ . 7,002 కోట్లు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటాల పంపిణీ కింద తెలంగాణ రాష్ట్రానికి రూ. 3,637 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు రూ. 7,002.52 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. జనవరి నెలకు గానూ రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటా పంపిణీ నిధులను కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం విడుదల చేసింది. ఇందులో భాగంగా దేశంలోని 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గానూ రూ.1,73,030 కోట్లను విడుదల చేసినట్టు ఆర్థిక శాఖ వెల్లడించింది. మూలధన వ్యయాన్ని వేగవంతం చేసే ఉద్దేశం, రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, సంబంధిత ఖర్చులను దృష్టిలో పెట్టుకొని అధిక మొత్తంలో నిధులు విడుదల చేసినట్టు స్పష్టం చేసింది. అయితే గత నెల డిసెంబర్ పన్నుల వాటా కింద రాష్ట్రాలకు కేంద్రం కేవలం రూ.89,086 కోట్లు విడుదల చేసినట్టు తెలిపింది. కాగా… పన్నుల వాటాలో ఉత్తరప్రదేశ్కు అత్యధికంగా రూ. 31,039 కోట్లు దక్కాయి. ఆ తరువాత స్థానంలో బీహార్కు రూ.17,403 కోట్లు, మధ్యప్రదేశ్కు రూ. 13,582 కోట్లు, పశ్చిమ బెంగాల్కు రూ. 13,017 కోట్లను కేంద్రం విడుదల చేసింది. అత్యల్పంగా గోవాకు రూ.667 కోట్ల వాటాను పంపిణీ చేసింది. నిబంధనల ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో 14 వాయిదాల్లో కేంద్ర పన్నుల వాటాను రాష్ట్రాలకు పంపిణీ చేయొచ్చని తెలిపింది.
కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా రూ. 3,637 కోట్లు
1:55 am