నవతెలంగాణ – సూర్యాపేట: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి త్వరలో గుడి కట్టబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర రెడ్డి అభిమానుల సంఘం కీలక ప్రకటన చేసింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకలలో ఈ గుడి నిర్మిస్తారమని మార్చి 19వ తేదీన గుడి నిర్మాణానికి సంబంధించి భూమి పూజ చేయనున్నట్లు రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేడి సంతోష్ ప్రకటించారు. ఈ కార్యక్రమం చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. కనిపించని దేవుడి కంటే కనిపించే దేవుడు సీఎం రేవంత్ రెడ్డి అని, దేవుడిలా తమ కోరికలను రేవంత్ రెడ్డి తీరుస్తున్నాడని అందువల్లే ఆయనకు గుడి కట్టబోతున్నట్లు చెప్పారు. ప్రజల బాగోగులు చూస్తున్న రేవంత్ రెడ్డే తెలంగాణ దేవుడని, ఇలాంటి కారణ జన్ముడికి గుడి కట్టడం తమ అదృష్టం అని చెప్పారు. భూమి పూజ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.