విలువ కట్టలేని బహుమతి ఇచ్చినందుకు థాంక్స్: ఎంఎస్‌ ధోనీ

నవతెలంగాణ – హైదరాబాద్: టీమ్‌ఇండియా నాలుగో ప్రపంచకప్‌ గెలిచినందుకు దేశమంతా ఆనందంలో మునిగిపోయింది. దేశ నలుమూలలా పటాకులు కాల్చి వేడుకలు జరుపుకున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో భారత్‌ గెలుపొందింది. చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో చివరికి రోహిత్‌ సేనను విజయం వరించింది. దీంతో 17 ఏండ్ల తర్వాత పొట్టి ఫార్మాట్‌లో టీమ్‌ఇండియా రెండో ప్రపంచకప్‌ను గెలిచినట్లయింది. 2007లో ధోనీ సారథ్యంలోని మెన్‌ ఇన్‌ బ్లూ టైటిల్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ సారథి ఎమ్మెస్‌ ధోనీ ఆనందం వ్యక్తంచేస్తూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టాడు. ఇప్పుడు అది వైరల్‌గా మారింది. 5 ‘వరల్డ్‌ కప్‌ 2024 చాంపియన్స్‌. ఈ మ్యాచ్‌ సమయంలో నా హార్ట్‌ రేట్‌ పెరిగిపోయింది. నిశ్శబ్దంగా ఉంటూనే విజేతగా నిలిచారు. ప్రతి ఒక్కరి మీద నమ్మకం ఉంచి కుర్రాళ్ల నుంచి ఫలితం రాబట్టడం అద్భుతం. వరల్డ్‌ కప్‌ను స్వదేశానికి తీసుకొస్తున్నందుకు ప్రతి భారతీయుడు గర్వంగా ఫీలవుతాడు. కంగ్రాట్స్‌ బాయ్స్‌. పుట్టిన రోజుకు వెల కట్టలేని బహుమతిని ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ ఇన్‌స్టా వేదికగా ధోనీ పోస్టుచేశాడు. జులై 7న ధోనీ బర్త్‌డే. దానిని ప్రస్తావిస్తూ అలా పెట్టాడని అభిమానులు కామెంట్లు పెట్టారు.

Spread the love