మేడారంలో మహాఘట్టం: సమ్మక్క తల్లి ఆగమనం.. అడవంతా జన సంద్రమే..

నవతెలంగాణ -తాడ్వాయి 
తెలంగాణ కుంభమేళా.. మేడారం జాతరలో మహా ఘట్టం మొదలైంది. నిన్న సారలమ్మ తల్లి గద్దెలను వేంచేయగా.. ఈ రోజు చిలకలగుట్ట నుండి సమ్మక్క తల్లి గద్దెలను అధిష్టించడానికి బయలు దేరింది. తమ సంప్రదాయ పద్ధతిలో ఆలయ పూజారులు పసుపు కుంకుమ రూపంలో ఉన్న సమ్మక్క అమ్మ వారిని తీసుకొని బయలు దేరారు. ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఏ కే 47 గన్ తో 6.51 పి ఎం  గాల్లోకి కాల్పులు జరిపి అమ్మవారి రాకకు నాంది పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క, ప్రముఖులు, ఉద్యోగు లు సమ్మక్క తల్లికి స్వాగతం పలికారు.
గాల్లోకి కాల్పులు జరుపుతున్న ఎస్పీ
అక్కడి నుంచి ఊరేగింపుగా, లక్షలాది మంది భక్తులు అమ్మ వారికి కేరింతలతో.. సమ్మక్క తల్లికి జై అనే నినాదాలతో స్వాగతం పలికారు. అమ్మ వారిని తీసుకువస్తుండగా.. పూజారులు కాళ్లకు అడ్డం పడితే పుణ్యం దక్కుతుందన్న నమ్మకంతో అనేక మంది భక్తులు దారిపొడవునా అమ్మవారి రాకకు అడ్డం పడుతున్నారు. వారిని పక్కకు జరుపుతూ.. రోప్ పార్టీ, పోలీసులు భారీ బందోబస్తు మధ్య సమ్మక్క తల్లిని గద్దె మీదకు తీసుకువస్తున్నారు.
చిలకలగుట్ట వద్ద జనాలు
అటు చిలకలగుట్ట నుంచి గద్దెల వరకు, మరోవైపు గద్దెల వద్ద జై సమ్మక్క తల్లి అనే భక్తుల నినాదాలు నట్టనడవిలో మిన్నంటుతున్నాయి. మేడారం చుట్టు ముట్టు 50 కి.మీ మేర అడవంతా జన సంద్రమై భక్తి పారవశ్యంతో అమ్మవారి నామ స్మరణతో పులకించిపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి లక్షాలాది మంది భక్తులు జాతరను వీక్షించేందుకు తరలివచ్చారు. మొత్తంగా ఈసారి 2 కోట్ల మంది వనదేవతలను దర్శించుకోవచ్చని అధికారుల అంచనా వేస్తున్నారు.
మరోవైపు మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. నేడు సమ్మక్క తల్లి గద్దెలను అధిష్టించే మహాఘట్టాన్ని చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తరలివస్తుడంతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా.. ఈ నెల 21న సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న అంతా గద్దెలపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు. ఈ సమయంలోనే లక్షలాది భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నెల 24న దేవతల వన ప్రవేశంతో జాతర ముగియనుంది.
Spread the love