నవతెలంగాణ – కోల్కతా: పశ్చిమబెంగాల్ లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంపై కాంగ్రెస్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ప్రమాదానికి మోడీ సర్కార్ వైఫల్యమే కారణమని ఆరోపించింది. పదేళ్ల పాలనలో రైల్వేశాఖను బీజేపీ దుర్వినియోగం చేసిందని మండిపడింది. ‘‘పదేళ్లుగా మోడీ సర్కార్ రైల్వే మంత్రిత్వశాఖను పూర్తిగా దుర్వినియోగం చేసింది. ఆ శాఖను ప్రచార వేదికగా మార్చేసింది. నేడు జరిగిన ఈ ప్రమాదం వాస్తవానికి దర్పణం పడుతోంది. దీనిపై బాధితుల తరఫున పోరాడుతాం. మోడీ ప్రభుత్వాన్ని దీనికి జవాబుదారిని చేస్తాం’’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. బాధితులకు తక్షణమే పరిహారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.