– సిపిఎం జిల్లా కార్యదర్శి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు రమేష్ బాబు డిమాండ్
నవతెలంగాణ- కంటేశ్వర్ : అంగన్వాడి మహిళల పట్ల ప్రభుత్వ వివక్షత విడనాడాలని సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు రమేష్ బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారంజిల్లా కేంద్రంలో జరిగిన అంగన్వాడీ ఉద్యోగుల 9వ రోజు సమ్మెలో సిపిఎం జిల్లా కార్యదర్శి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు అయిన ఏ రమేష్ బాబు మాట్లాడుతూ.. గత తొమ్మిది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు మినీ వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డున పడి నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వ పెద్దలు ఎవరు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయటం సరైనది కాదని మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందని ఆయన విమర్శించారు ఒకవైపు మహిళల పట్ల అపారమైన గౌరవం ఉందని ప్రకటిస్తూనే రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది మహిళలు తమ సమస్యల పరిష్కారం కోసం గలమెత్తి పోరాడుతుంటే వారిని చర్చలకు పిలిచి సమస్యలను సానుకూలంగా పరిష్కరించే బదులు మరింత జటిలం చేయటం సరైనది కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఒకవైపు ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉంటే అంగన్వాడీ ఉద్యోగుల వేతనాలు పెంచకుండా అంత్యక్రియల ఖర్చులను ప్రకటించటం బాధ్యతారహితమని వెంటనే అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం నెలకు 26,000 చెల్లించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని అధికారుల వేధింపులను, బెదిరింపులను మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం మరింత తాత్సారం చేస్తే అంగన్వాడీ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం అవుతుందని, అందుకు జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. స్వర్ణ ప్రాజెక్టు నాయకులు సరిత, జరీనా సునీత, లలిత, అంజలి విజయ, శివరాజమ్మ, రేణుక తదితరులు పాల్గొన్నారు ముందుగా నిన్న అనారోగ్యంతో మరణించిన మోసరా సెక్టార్ కు చెందిన మంగ మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలియజేశారు.