30 మంది చిన్నారులను బలిగొన్న మానవమృగానికి.. జీవిత ఖైదు

నవతెలంగాణ – ఢిల్లీ
30మంది చిన్నారులపై లైంగికదాడికి పాల్పడి హత్య చేసిన కామాంధుడికి ఢిల్లీలోని రోహిణి కోర్టు జీవిత ఖైదు విధించింది. రవీంద్ర కుమార్ అనే వ్యక్తి ఆడ పిల్లలపై లైంగికదాడికి పాల్పడి హత్య చేశాడు. దాదాపు 30మంది చిన్నారులను చిదిమేశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. రవీంద్ర కుమార్ ను లైంగికదాడి, కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో రోహిణి కోర్టు మే 10న దోషిగా లేల్చింది. అతనికి గురువారం జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే రవీంద్ర కుమార్ కు మరణ శిక్ష వేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. రోహిణి కోర్టు తీర్పుపై పోలీసులు పై కోర్టు వెళ్తరా లేదా అన్నది చూడాలి. ఢిల్లీలో కూలీగా పనిచేస్తున్న రవీంద్ర కుమార్ అనే వ్యక్తి డ్రగ్స్ కు బానిసగా మారి, అశ్లీల చిత్రాలను చూసి పిల్లలపై లైంగిక దాడి చేసి వారిని చంపేవాడని పోలీసులు కోర్టు తెలిపారు. రవీంద్ర 2008 నుంచి 2015 వరకు 30 పిల్లలను అత్యాచారం చేసి హత్య చేశాడని చెప్పారు. రవీంద్రకు 18 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు వారి కుటుంబ ఉపాధి నిమిత్తం ఉత్తర ప్రదేశ్ లోని కాస్ గంచ్ నుంచి ఢిల్లీకి చేరుకుంది.
రవీంద్ర తండ్రి ప్లంబర్‌గా పని చేయగా, అతని తల్లి ఇళ్లలో ఇంటి పని చేసి జీవించే వారు. ఢిల్లీకి వచ్చిన కొద్ది రోజులకే డ్రగ్స్‌కు బానిసైన రవీంద్ర కుమార్ వీడియో క్యాసెట్‌లో అశ్లీల చిత్రాలు చూసేవాడని పోలీసులు గుర్తించారు. రవీంద్రకుమార్ రోజంతా కూలి పని చేసి సాయంత్రం డ్రగ్స్, మద్యం మత్తులో ఉండేవాడు. ఆ తర్వాత అశ్లీల చిత్రాలు చూసేవాడు. రాత్రి 8 గంటలకే పడుకుని అర్ధరాత్రి లేచి ఆడ పిల్లల కోసం వెతికేవాడు. ఇలా ఒంటరిగా పిల్లలు కనిపించగానే వారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడి అతమార్చేవాడు. రవీంద్ర కుమార్ చిన్నారుల కోసం ఒక్కోసారి 40 కిలోమీటర్ల దూరం కూడా నడిచేవాడని పోలీసులు చెప్పారు. పిల్లలకు డబ్బులిచ్చి, చాక్లెట్లు ఇచ్చి మంచిక చేసుకుని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడి హత్య చేసేవాడని పేర్కొన్నారు. అతని కామానికి 6 ఏళ్లు నుంచి 12 ఏళ్లు పిల్లలు బలయ్యారు. రవీంద్ర కుమార్ 2014లో 6 ఏళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడి చంపేశాడు. మృతదేహాన్ని సెఫ్టిక్ ట్యాంక్ లో పడేశాడు. ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి.. ఢిల్లీలోని రోహిణిలోని సుఖ్‌బీర్ నగర్ బస్టాండ్ దగ్గర నుంచి అతడిని అరెస్ట్ చేశారు. రవీంద్రను పట్టుకునే ముందు, పోలీసులు డజన్ల కొద్దీ సీసీటీవీ కెమెరాల నుండి ఫుటేజీని తనిఖీ చేశారు. బాలికను కిడ్నాప్ చేసి, శారీరకంగా హింసించి, గొంతు కోసి, సెప్టిక్ ట్యాంక్‌లో పడేశాడని గుర్తించారు. రవీంద్ర 2008లో ఢిల్లీలోని కర్లా ప్రాంతానికి చెందిన ఓ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి హత్య చేశాడు.అప్పుడు అతన్ని పోలీసులు పట్టుకోలేదు. దీంతో అతను రెచ్చిపోయాడు.

Spread the love