ప్రియుడితో కలిసి చెల్లిని చంపిన అక్క..

నవతెలంగాణ – పట్నా: బిహార్‌లో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి ఓ 13 ఏళ్ల బాలిక తన తొమ్మిదేళ్ల సోదరిని హత్య  చేసింది. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని గుర్తుపట్టేందుకు వీలులేకుండా ముఖంపై యాసిడ్‌ పోసి కాల్చేసింది. దీంతోపాటు వేళ్లనూ నరికేసింది. తమ చిన్న కుమార్తె కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ నేరం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితురాలు, ఆమె ప్రియుడితోపాటు ఈ ఘటనలో వారికి సహకరించిన ఓ బంధువురాలిని పోలీసులు అరెస్టు చేశారు. వైశాలీ జిల్లాకు చెందిన ఓ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఓ వివాహ వేడుక కోసం తల్లిదండ్రులు ఇటీవల వేరే ఊరికి వెళ్లారు. నాలుగైదు రోజుల అనంతరం వారు ఇంటికి చేరుకోగా.. చిన్న కుమార్తె కనిపించడం లేదని గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే వారి ఇంటి వెనుక బాలిక మృతదేహం లభ్యమైంది. కాల్‌ రికార్డింగ్‌, ఇతరత్రా సమాచారం ఆధారంగా.. మృతురాలి సోదరిని విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ నేరాన్ని తామే చేసినట్లు అంగీకరించింది. ‘బాలిక, ఆమె ప్రియుడు సన్నిహితంగా ఉండటాన్ని తొమ్మిదేళ్ల సోదరి చూసింది. దీంతో ఎక్కడ తమ విషయం ఇంట్లో చెబుతుందోనన్న భయంతో వారు ఆమెను అంతమొందించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆమెపై దాడి చేసి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని ఇంట్లోనే మూడు రోజులపాటు దాచిపెట్టారు. దుర్వాసన వస్తుండటంతో ఇంటి వెనుక ప్రాంతంలో వదిలేశారు.

Spread the love