– అదనపు కలెక్టర్ శ్రీనివాస్
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్
యాసంగి ధాన్యం సేకరణ విషయంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియను నిర్వహించాలని రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ అన్నారు. సోమవారం తన చాంబర్లో రైస్ మిల్లర్లు, పౌరసరఫరాలు, మార్కెటింగ్ తదితర అందిత శాఖల అధికారులతో యాసంగి ధాన్యం సేకరణపై సమీక్షించారు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం మొత్తం వివరాలను సమీక్షించడమే కాకుండా, ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రైతు ఖాతాలో తక్షణమే డబ్బులు జమ అయ్యే ప్రాసెస్ కు సంబంధించి అన్నిస్థాయిల్లో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ జాప్యం లేకుండా ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు.మిల్లర్లు ప్రభుత్వం సూచించిన విధంగా జాప్యం లేకుండా సీఎంఆర్ ధాన్యాన్ని ఇవ్వాలన్నారు.ట్రక్ షీట్ తో పాటు, ఎఫ్ ఏ క్యూ రిపోర్టు కచ్చితంగా ఉండేలా ఏఈఓ లు చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.ట్రక్ షీట్ తెప్పించుకొని సాధ్యమైనంత త్వరగా ట్యాబ్ లో అప్లోడ్ చేయాలని ఈ విషయంలో ఎవరు ఆలస్యం చేయొద్దన్నారు. తాలు విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు.
మిల్లర్లు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని,తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.దాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండాలని, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా నీడ, త్రాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద టార్పాలిన్లను రెడీగా ఉంచాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో డీఎస్ఓ వెంకటేశ్వర్లు, మార్కెటింగ్ ఏడి శ్రీకాంత్, సివిల్ సప్లై డిఎం నాగేశ్వరరావు, డీసివో, కిరణ్ కుమార్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శ్రీనివాస్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.