నవతెలంగాణ-గోదావరిఖని:
సీఎస్ఆర్ నిధులతో ప్రభావిత ప్రాంతాలను అభివృద్ిధ చేసే సింగరేణి యాజమాన్యం తన సొంత పరిధిలోని కార్మికుల నివాస ప్రాంతాలు, గనులకు వెళ్లే రోడ్ మార్గాలను ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడంలేదని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగవారం పెద్ద ఎత్తున 3ఇంక్లైన్ రోడ్ జంక్షన్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. అనంతరం బైక్ ర్యాలీగా బయలుదేరి, రామగుండం1 ఏరియా జీఎంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ ఆరీ-1 ఏరియాలోని జిడికె 11వ గనికి వెళ్లే కార్మికులు మంథని క్రాస్ రోడ్ నుండి గని వరకు వెళ్లే రోడ్డు పూర్తిస్థాయిలో గుంతలతో ఉన్నదని, కనీసం రోడ్డు వెంబడి చీకట్లో లైటింగ్ సరిగా లేక అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. అన్ని గనులకు వెళ్లే రోడ్డు మార్గాలను శాశ్వతంగా బాగు చేయాలని, లైటింగ్ పూర్తిస్థాయిలో మెరుగుపరిచి విధులకు వెళ్లే కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఆర్జీ-1 కార్యదర్శి మెండె శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి జెల్లా గజేంద్ర, ఉపాధ్యక్షుడు ఆసరి మహేష్, ఆరెపల్లి రాజమౌళి, బొద్దుల రఘువరన్, అన్నం శ్రీనివాస్, దాసరి సురేష్, జె మల్లేష్, నంది నారాయణ తదితరులున్నారు.