– ఉప్పల్ చిలుకనగర్లో ఘటన
– కూతుళ్లు, మహిళా మండలి సభ్యులతో కలిసి కొడుకు ఇంటి ముందు తల్లి నిరసన
నవతెలంగాణ-ఉప్పల్
నవమాసాలు మోసి కని పెంచి, కన్న కొడుకు బాగు కోసం ఆస్తి సంపాదిస్తే… ఆస్తిని బలవంతంగా లక్కోవ డమే కాకుండా తల్లికి వృద్యాప్యం వచ్చాక ఇంటి నుండి బయటకి గెంటేసిన దారుణ ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి చిలకానగర్లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలకానగర్ లో నివాసముంటున్న వంగరి రమాదేవికి.. ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు… 1997 లో భర్త సుదర్శన్ చనిపోయారు.. ముగ్గురు కూతుళ్లు, కుమారుని పెండ్లీలు జరిగాయి. కొడుకు శివశంకర్ కోసం, భారీ ఆస్తిని రమాదేవి కూడబె ట్టింది… కొడుకు కోడలు ఓ హై స్కూల్ను సొంతంగా నడిస్తున్నారు. ఇదిలా ఉండగా రమాదేవి ఆస్తిని కొడుకు బలవంతంగా తన పేరుపై రాయించుకున్నాడు. సొంత సోదరిలను సైతం పుట్టింటికి రాకుండా చేశాడు. శివశంకర్ వృద్యాప్యంలో ఉన్న రమాదేవిని ఇంటి నుండి బయటకు పంపించేశాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న రమాదేవి ఓల్డ్ ఏజ్ హౌమ్కు వెళ్లింది. కుమారుడు బాగోగులు చూసుకోక, ఆరోగ్యం బాగోలేక ఓల్డ్ ఏజ్ హౌమ్ లో ఉంటున్న రమాదేవిని ముగ్గురు కూతుళ్లు తమ ఇంటికి తీసుకెళ్లారు.
శివశంకర్ ఇంటి ముందు నిరసన
రమాదేవి బుధవారం తన ఇంట్లో తాను ఉంటానని అవేదన వ్యక్తం చేస్తూ కూతుళ్లు, మహిళ మండలి సభ్యులతో కలిసి చిలకానగర్లో శివశంకర్ ఇంటి ముందు నిరసన చేపట్టింది. ఆర్డివో ఆర్డర్ కాపీతో, మహిళ మండలి సభ్యులతో కలిసి న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. తల్లిని చూడని శివ శంకర్ హై స్కూల్ నడిపిస్తూ విద్యార్థులకు ఎలాంటి పాఠాలు చెప్తారు అని సొంత సోదరిలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చట్టం ప్రకారం శివ శంకర్ పై చర్యలు చేపడతామని వారికి తెలియచేసారు.