మిల్లర్ల ఆగడాలను అరికట్టి వెంటనే ధాన్యాన్ని తరలించాలి

– పైడాకుల అశోక్ ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు
– కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 163 వ జాతీయ రహదారిపై భారీ రాస్తారోకో

నవ తెలంగాణ-గోవిందరావుపేట
మిల్లర్ల ఆగడాలను సిండికేట్ సిస్టంను అరికట్టి వెంటనే ధాన్యాన్ని తరలించే ఏర్పాట్లు చేయాలని కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని చల్వాయి గ్రామంలో తడిసి పేరుకుపోయి తోలకుండా మిగిలిపోయిన ధాన్యం బస్తాలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అశోక్ పరిశీలించారు అనంతరం పార్టీ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో 163 వ జాతీయ రహదారిపై నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతన్న పంటను అమ్ముకోలేని స్థితిలో ఉన్నాడని వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతే రాజు అని చెప్పే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆడుకోకుండా, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతులను అప్పులపాలు చేస్తున్నాయని, ఇప్పటికే వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వకుండా రైతులను మోసం చేసిన ప్రభుత్వాలు, రైతన్న కష్టపడి పండించిన పంటకు కూడా ఆంక్షలు విధిస్తూ, మిల్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయకుండా, క్వింటాకు 10 కిలోల తరుగును విధిస్తూ రైతుల కష్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకుంటున్నాయని ఆరోపించారు. ములుగు జిల్లాలో వరి ధాన్యం సాగు ఎక్కువ అని తెలిసిన మిల్లులను కేటాయించకుండా, కొనుగోలు కేంద్రాల ద్వారా కొనబడిన ధాన్యపు బస్తాలు ఇంకా అక్కడే ఉండడం వల్ల, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం భద్రపరుచడానికి సరైన వసతులు లేక, అకాల వర్షాల వల్ల తడిసిపోయాయి అని, వాహనాలు రాక రవాణా జరగక రైతులు వాహనాలకు డబ్బులు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది అని, ఇసుక రవాణాకు ఉచితంగా దొరికే వాహనాలు ధాన్యాన్ని ఎగుమతి చేయడానికి దొరక్కపోవడం విడ్డూరం అని అన్నారు. ములుగు లారీ అసోసియేషన్ వారు కూడా దయచేసి రైతన్న పరిస్థితిని అర్థం చేసుకోవాలని, వాహనాలు పెట్టి ధాన్యాన్ని తరలించాలని వేడుకుంటున్న అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పండించిన ప్రతి గింజను మరియు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, మిల్లర్ల ఆగడాలను అరికట్టాలని, కొనుగోలు కేంద్రాలలో సరైన మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని, దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాలి అని, పంట నష్టం వాటిల్లితే పంట నష్ట పరిహారం కల్పించాలని లేకపోతే రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకోలు, ధర్నాలు చేస్తామని, కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, జిల్లా మహిళ అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి, ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి భగవాన్ రెడ్డి, ములుగు మండల అధ్యక్షులు ఎండి. చాంద్ పాషా, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్, జిల్లా నాయకులు కణతల నాగేందర్ రావు, వెంకటాపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బండి శ్రీనివాస్, మండల మహిళ అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, మండల ప్రధాన కార్యదర్శి వేల్పుగొండ పూర్ణ, ఎస్.సి.సెల్ మండల అధ్యక్షులు పడిదల సాంబయ్య, ఎంపీటీసీలు చాపల ఉమాదేవి- నరేందర్ రెడ్డి, గుండెబోయిన నాగలక్ష్మి- అనిల్ యాదవ్, గోపిదాసు ఏడుకొండలు, జెట్టి సోమయ్య, పాలడుగు వెంకటకృష్ణ, కొంపెళ్లి శ్రీనివాస్ రెడ్డి, సూదిరెడ్డి జనార్దన్ రెడ్డి, సూదిరెడ్డి జయమ్మ, వేల్పుగొండ ప్రకాశ్, కోరం రామ్మోహన్, గుండె శరత్, మల్లారెడ్డి, బద్దం జనార్దన్ రెడ్డి, కంటెం సూర్యనారాయణ, అలుగుబెల్లి వెంకటస్వామి తదితర నాయకులు పాల్గొన్నారు.

Spread the love