నవతెలంగాణ – హైదరాబాద్
ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీకి వెల్లడించడంపై గడువును మరింత పొడిగించాలని కోరుతూ ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టనుంది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణ చేస్తుంది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీకి వెల్లడించేందుకు తుది గడువును జూన్ 30 వరకూ పొడిగించాలని ఎస్బీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ బద్ధం కాదంటూ సుప్రీం కోర్టు గత నెలలో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. బాండ్ల జారీని తక్షణం నిలిపివేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాకుండా, బాండ్ల ద్వారా వివిధ పార్టీలకు అందిన సొమ్ము, దాతల వివరాలను ఈ నెల 13లోగా ఈసీ ముందుంచాలని ఆదేశించింది. అయితే, ఈసీకి ఈ సమాచారం సమర్పించేందుకు మరికొంత సమయం కావాలని ఎస్బీఐ పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు, సుప్రీం తీర్పు ప్రకారం 6వ తేదీలో లోపు బాండ్ల వివరాలు సమర్పించని ఎస్బీఐ కోర్టు ఆదేశాల ఉల్లంఘనకు పాల్పడిందని మరో పిటిషన్ కూడా దాఖలైంది. నేడు ఈ రెండు వ్యాజ్యాలపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది.