నవతెలంగాణ – సూర్యాపేట
మద్యంమత్తు జీవితాలను చిత్తుచేస్తోంది. మత్తులో ఒళ్లుమరిచి కొందరు ప్రాణాలమీదకు తెచ్చుకుంటుంటే… విచక్షణ కోల్పోయిన మరికొందరు ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు. ఇలా ముగ్గురు దుండగులు ఫుల్లుగా మద్యంసేవించి నడిరోడ్డుపైనే ఒకరిని అంతమొందించేందుకు ప్రయత్నించారు. ఈ దుర్ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. పట్టపగలు.. అందరూ చూస్తుండగానే ముగ్గురు యువకులు మరో యువకుడిపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి రాళ్లతో దాడి చేశారు. హఠాత్తుగా జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మామిళ్లగడ్డకు చెందిన కృష్ణ అలియాస్ బంటి, మహేశ్, సన్నీ కలిసి తాళ్లగడ్డకు చెందిన చీకూరి సంతోష్ను స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద అడ్డగించారు. ఇద్దరు యువకులు సంతోష్ను అదిమి పట్టుకున్నారు. ఒకరు కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం బండరాళ్లతో యువకుడి తలపై మోదేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. ఇలా నడిరోడ్డుపై యువకులు వీరంగం సృష్టిస్తుండగా స్థానికులు ధైర్యం చేసి ఆయనను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. చివరకు సంతోష్ అందరినీ తప్పించుకొని అక్కడి నుంచి బయటపడ్డాడు. అనంతరం సంతోష్ను చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సంతోష్కి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూస్తున్న కొంత మంది మహిళలు భయంతో వణికిపోయారు. అక్కడే ఓ భవంతిపై ఉన్న వ్యక్తి చరవాణిలో ఈ దృశ్యాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమంలో పెట్టడంతో వైరల్గా మారాయి. సూర్యాపేట ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ఘటనా స్థలానికి చేరుకొని కత్తి స్వాధీనం చేసుకున్నారు. 2021లో కృష్ణ అలియాస్ బంటిపై దాడి చేసిన కేసులో సంతోష్తోపాటు ఇద్దరు యువకులు జైలుకు వెళ్లి వచ్చారు. అప్పటి నుంచి సంతోష్ కేసు ఉపసంహరించుకోవాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణ తన స్నేహితులతో కలిసి గురువారం ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఇన్స్పెక్టర్ వివరించారు. బాధితుడి తల్లి రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.